నారాయణఖేడ్,అందోల్ నియోజకవర్గాల్లో లక్షా అరవైఐదు వేల ఎకరాలకు సాగునీరందిం చడమే లక్ష్యంగా రూ.1,774 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న బసవేశ్వర ఎత్తిపోతలకు తొలి అడుగు పడనున్నది. మనూరు మండలం బోరంచ శివారులో నిర్మించనున్న పంప్హౌస్ నిర్మాణ పనులను శనివారం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు. ఇప్పటికే పంప్హౌస్, సబ్స్టేషన్, డంప్యార్డుల నిర్మాణం కోసం 34.14 ఎకరాలను సేకరించగా, 42 మంది రైతులకు రూ.4,81,20,000ల నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందజేసింది. అలాగే, జగన్నాథ్పూర్ శివారులో రూ.2,14 కోట్లతో చెరువు నిర్మాణం పనులు, నాగల్గిద్ద మండలం మోర్గిలో రూ.1.29 కోట్లతో మోడల్ స్కూల్ హాస్టల్ భవనం, కరస్గుత్తిలో రూ.6.68 కోట్లతో నిర్మించిన 30 పడకల దవాఖానను కూడా మంత్రి ప్రారంభిస్తారు.
నారాయణఖేడ్, ఫిబ్రవరి 17: నారాయణఖేడ్ నియోజకవర్గానికి వరప్రదాయనిగా మారనున్న బసవేశ్వర ఎత్తిపోతల పథకం కార్యరూపం దాల్చనున్నది. రూ.1,774 కోట్ల భారీ వ్యయంతో 1.65 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు క్షేత్రస్థాయిలో తొలి అడుగు పడనున్నది. మనూరు మండలం బోరంచ శివారులో నిర్మించనున్న పంప్హౌస్ పనులను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు శనివారం ప్రారంభించనున్నారు. పనులకు శ్రీకారం చుట్టేలా అధికారులు వేగవంతంగా చర్యలు చేపడుతున్నారు. బోరంచ శివారులో పంప్హౌస్, సబ్స్టేషన్, డంప్ యార్డు నిర్మాణం కోసం 34.14 ఎకరాల భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ భూములకు సంబంధించిన 42 మంది రైతులకు రూ.4,81,20,000ల చెక్కులను ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, ఆర్డీవో అంబాదాస్ రాజేశ్వర్ అందజేశారు. నియోజకవర్గంలోని నారాయణఖేడ్, కంగ్టి, కల్హేర్, మనూరు, సిర్గాపూర్, నాగల్గిద్ద మండలాల్లో 1.31 లక్షల ఎకరాలు, అందోల్ నియోజకవర్గంలోని రేగోడ్, వట్పల్లి మండలాల్లో 34 వేల ఎకరాలకు బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరందనున్నది.
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు, నాగల్గిద్ద మండలాల్లో 46 కిలోమీటర్ల మేర మంజీరా పరివాహకం ఉంది. గత ప్రభుత్వాల హయాంలో నియోజకవర్గ ప్రజలకు మంజీరాతో ఒరిగిందేమీలేదు. మనసుంటే మార్గం ఉంటుందనే నానుడి తరహాలో కేసీఆర్ ప్రభుత్వం నియోజకవర్గంలో ప్రవహిస్తున్న మంజీరా నదిని వినియోగించుకుని నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు రూపొందించిన బృహత్తర ప్రణాళికకు కార్యరూపమే బసవేశ్వర ఎత్తిపోతల పథకం. బోరంచ శివారులో ఒకటి, కంగ్టి మండలం రాంతీర్థ్ శివారులో మరో పంప్హౌస్ను నిర్మించి, వీటి ద్వారా నీటిని విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించారు. బోరంచ పంప్హౌస్ నుంచి రాణాపూర్, దుదగొండ, ప్యారారం పంప్హౌస్లతో కరస్గుత్తి, మనూరు, నారాయణఖేడ్, రేగోడ్, వట్పల్లి, కెనాల్, రాంతీర్థ్ పంప్హౌస్ నుంచి కంగ్టి మండలం తుర్కవడగామ వద్ద నిర్మిస్తున్న పంప్హౌస్తో అంతర్గాం, కంగ్టి కెనాల్ ద్వారా సాగు నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కరస్గుత్తి కెనాల్ కింద 88 వేల ఎకరాలు, కంగ్టి కెనాల్ పరిధిలో 21,800 ఎకరాలు, అంతర్గాం కెనాల్ 11,200 ఎకరాలు, నారాయణఖేడ్ కెనాల్ 10 వేల ఎకరాలు, వట్పల్లి కెనాల్ 23 వేలఎకరాలకు సాగు నీందనున్నది.
ఎన్నో ఏండ్లుగా చెరువు కోసం నారాయణఖేడ్ మండలంలోని జగన్నాథ్పూర్ గ్రామస్తులు చేస్తున్న నిరీక్షణ ఫలించనుంది. జగన్నాథ్పూర్ శివారులో రూ.2.14 కోట్లతో నిర్మించనున్న చెరువు పనులకు మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు. నాగల్గిద్ద మండలం మోర్గిలో రూ.1.29 కోట్లతో మోడల్ స్కూల్ హాస్టల్ భవనం, కరస్గుత్తిలో రూ.6.68 కోట్లతో నిర్మించిన 30 పడకల దవాఖానను మంత్రి ప్రారంభించనున్నారు.
మనూరు, ఫిబ్రవరి 17: బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి భూమి పూజ చేయడానికి మంత్రి హరీశ్రావు రానున్న సందర్భంగా బోరంచ గ్రామ శివారులో అదనపు కలెక్టర్ వీరరెడ్డి సభా స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. శనివారం నిర్వహించనున్న సమావేశానికి చేసిన ఏర్పాట్లను అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మె ల్యే భూపాల్రెడ్డి, నారాయణఖేడ్ ఆర్డీవో అంబాదాస్ రాజేశ్వర్, మనూర్ తహసీల్దార్ తారాసింగ్, ఆర్ఐ తాజోద్దిన్ పరిశీలించారు.