గజ్వేల్, జనవరి 26: మండల పరిధిలోని కొల్గూర్లో దారుణం జరిగింది. చోరీకి వచ్చిన దుండగుడు మహిళ మెడపై బంగారు ఆభరణాలను తీసుకొని ముఖంపై దిండుపెట్టి హత్య చేశాడు. ఈ దారుణం శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీపీ అనురాధ, అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాస్లు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చెన్న శ్యామల(55) తెల్లవారుజామున 5.30కు ఇంటి ఆవరణలో ఉన్న బాత్రూం వెళ్లింది. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి వెళ్లి శ్యామల భర్త శ్రీనివాస్ పడుకున్న గదికి గొళ్లెం పెట్టాడు. శ్యామల బాత్రూం నుంచి బయటకు వచ్చే సమయంలో ఆగంతకుడు ఆమె ముఖంపై దిండుతో గట్టిగా వొత్తిపట్టుకోవడంతో స్పృహ తప్పింది. వెంటనే ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు పుస్తెల తాడు, అర తులం చెవికమ్మలు తీసుకొని పారిపోయాడు. ఈ క్రమంలో ఆమెకు గాయమైంది. 15 నిమిషాల తర్వాత తేరుకున్న శ్యామల భర్త పడుకున్న బెడ్రూం గడియ తీసి భర్తకు, చుట్ట్టుపక్కల వారికి విషయం చెప్పింది.
గాయమైన శ్యామలను ప్రథమ చికిత్స కోసం గజ్వేల్లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మరో దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందింది. భర్త శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సీపీ అనురాధ, అడిషినల్ డీసీపీ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని గజ్వేల్ ఏసీపీ రమేశ్, సీఐ జాన్రెడ్డిల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. కేసును త్వరగా ఛేదించాలని గజ్వేల్ ఏసీపీ, సీఐకి ఆదేశించారు. ఆగంతకుడిని పట్టుకునేందుకు గ్రామంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. డాగ్స్కాడ్ హత్యకు గురైన శ్యామల ఇంటి నుంచి గ్రామ శివారుకు వెళ్లి తిరిగి ఇంటికి చేరాయి. క్లూస్ టీం దిండుపై ఉన్న నిందితుడి వేలిముద్రలను సేకరించారు. శ్యామల హత్యకేసును త్వరలోనే ఛేదిస్తామని ఏసీపీ రమేశ్ తెలిపారు. విషయం తెలుసుకున్న ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఎంపీటీసీ గొడుగు జ్యోతిస్వామిలు గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు.