మట్టి పరీక్షలు చేసేందుకు ‘మే’నెల అనుకూలం
రైతులకు అవగాహన కల్పిస్తున్న కేవీకే శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు
రైతుల మేలు కోసమే అంటున్న అధికారులు
జహీరాబాద్, మే 23 : రైతులు అధిక పంట దిగుబడులు సాధించేందుకు భూసార పరీక్షలు చేసుకొని విత్తనాలు వేసుకోవాలని రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రతి ఏడాది రైతులు తమకున్న భూమిలో మట్టి పరీక్షలు చేసుకొని పంటలు వేసుకోవాలని, ఏపంట సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందో రైతులకు సూచిస్తున్నారు. పంటలకు సరైన మోతాదులో ఎరువులు వేసేందుకు భూసార ఫలితాలు మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. పంటలు సాగు చేసేందుకు రైతులు సేంద్రీయ ఎరువులు వేయాలని అవగాహన కల్పిస్తున్నారు. పొలంలో మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్ష కేంద్రాలకు పంపితే మం చి ఫలితాలు వస్తాయని కేవీకే శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు రైతులకు వివరిస్తున్నారు.
మనూరులో..
మనూరు మండల పరిధిలోని మొత్తం 29500ఎకరాలు గానూ, 10200 మంది రైతులు ఉన్నారు. వీటిలో 4500 ఎకరాల్లో వర్షాధార పంటల సాగు చేస్తుంటారు. వీటిలో ప్రతి ఏటా అత్యధిక విస్తీర్ణంలో పత్తి పంటను సాగుచేస్తున్నారు. మట్టి పరీక్షల ద్వారా భూమికి ఏ మోతాదులో ఎరువులు వాడొచ్చుననే విషయం తెలిసిపోతుంది. దీని ద్వారా తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలు సాధించవచ్చు. మట్టి పరీక్షలకు రైతులు వ్యవసాయాధికారులకు సంప్రదించి మట్టిని తీసుకొని వస్తే సంగారెడ్డి మట్టి పరీక్ష కేంద్రాలకు పంపించి వివరాలు రైతులకు తెలియజేస్తామని ఏవో శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
భూసార పరీక్షకు ఎంపిక చేసే విధానం..
రైతులు మట్టి పరీక్ష కోసం ఒకే రకమైన పొలం అయితే ప్రతి 5 ఎకరాలకు ఒక నమూనా మట్టి సేకరించాలి. ఐదు ఎకరాలకు మించి నేల రకం ఉంటే, 2 నమూనాలు సేకరించాలి.15 ఎకరాలకు 3 నమూనాలు తీయాలి. నేల వాలు, నేల రకం మార్పులు, ఉంటే 15 సెంట్లకు ఒక నమూనా సేకరించాలి. మట్టి సేకరించే ముందు పొలాన్ని యూనిట్లుగా విభజించాలి. పొలం వాలును బట్టి నేల రకాన్ని బట్టి ఇసుక నేల, గరక నేల, నల్ల రేగడి, ఒండ్రు భూమి, వంటి రకాన్ని పంట సాగు నకు కృషి చేస్తాయి.
మట్టి నమూనాలను సేకరించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రైతులు పంటలు సాగు చేసే ముందు ఎరువులు వేసేందుకు మట్టి పరీక్షలు చేసుకోవాలి.
చెట్ల కింద, గట్ల పక్కన కంచెల దగ్గర మట్టిని సేకరించరాదు.
కంపోస్టు, పశువుల ఎరువు కుప్పలు ఉంచిన చోట నమూనాలు తీయరాదు.
మట్టి నమూనాలు తీసేటప్పుడు నేల పైభాగంలోని చెత్తా,చెదారం తీసి వేయాలి.
నీరు నిలిచి బురదగా ఉన్న నేల నుంచి మట్టి నమూనాలు సేకరించరాదు. తీసిన మట్టిలో తేమ ఎక్కువగా ఉన్నట్లయితే నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టకూడదు.
మట్టి నమూనా సేకరించే విధానం..
పండ్ల తోటలకు
మామిడి,నిమ్మ, సపోట, జామ పంటల్లో 1-1.8 మీటర్లు లోతు తీసి మట్టి నమూనాలను 4-6 చొప్పున తీయాలి. భూమిలో నాలుగు చోట్ల తీయడం మేలు. చవుడు నేలలో 2 నమూనాలు తీయాలి. ఒకటి పై పొరలో 22.5 సెం.మీ వరకు, రెండోది 22.5 సెం.మీ నుంచి 45 సెం.మీ లోతు తీయాలి.
మట్టి పరీక్షలు చేయించుకోవాలి
రైతులు వ్యవసాయ పనులు చేసే ముందు మట్టి పరీక్షలను చేయించుకోవాలి. రైతులకు అనువైన సమయం ఇదే. పొలంలో ఉన్న మట్టి నమూనాలను సేకరించి పరీక్షలు చేయించుకుంటే భూసారం విలువ తెలుస్తది. ఏ రైతు అయినా పంట పండించాలంటే మూడు పెట్టుబడులు అవసరం. భూమి, విత్తనం, నీరు కావాలి. ముఖ్యమైంది భూమి. భూమి గుణగణాలు తెసుకొని ఏ పంటకు అనుకులంగా ఉంటుందో చూడాలి. మట్టి పరీక్షలో పంటల పెరుగుదలకు పోషకాలు భూమిలో ఎంత మోతాదులో ఉన్నాయో తెలుస్తుంది. సరైన సమయంలో మట్టి పరీక్షలు చేసుకోవాలి. రైతులకు కృషి విజ్ఞాన కేంద్రంలో ఉచితంగా మట్టి పరీక్షలు చేసి ఇవ్వనున్నారు. డీడీఎస్-కేవీకేలో మట్టి పరీక్షలు చేస్తారు. మట్టి పరీక్షల కోసం రైతులు డీడీఎస్-కేవీకేలో ఉన్న భూసార పరీక్షల నిఫుణులను సంప్రదించాలి.
–భిక్షపతి, ఏడీఏ జహీరాబాద్
భూసార పరీక్షతో రైతుకు లాభాలు
భూమి స్వభావం, భూమి ఏ రకానికి చెందినదో తెలుసుకోవాలి.
భూమికి అనుకులమైన పంటలు సాగు చేసేందుకు పంటల వివరాలు తెలుపుతారు.
భూసార పరీక్షతో పోషక పదార్థాలు ఎంత పరిమాణంలో ఉన్నాయి తెలుసుకోవచ్చు.
భూసార పరీక్ష ఫలితాలు చూసి రైతులు పంటలు సాగు చేయాలి. పంటల సాగు ఖర్చులు తగ్గించుకోవాలి. అధిక దిగుబడులు సాధిం చేందుకు అవకాశమున్నది.
అధిక దిగుబడులు..
రైతులకు భూసార పరీక్ష కేంద్రాల వారు మట్టి నమూనాలను పరీక్ష చేసి మట్టిలో ఉన్న విషయలు తెలుపుతారు. తేలిక నేల, బరువు నేల, మధ్యస్థంగా ఉందా అనే విషయాలు వివరిస్తారు. నేల ఆమ్లగుణం కలిగి ఉన్నచో ఎంత మోతాదులో సున్నం వేసి బాగు చేసుకునే అవకాశం ఉందో రైతులకు వివరిస్తారు. మట్టి పరీక్ష ఫలితాలు చూసి రైతులు సేంద్రియ ఎరువు, నత్రజని, బాస్వరం పొటాషియం వేసుకోవాలి.
నమూనాలను సేకరించే సమయం..
రైతులు భూసార పరీక్షల కోసం మట్టిని పంట పొలంలో లేని సమయంలో మట్టి సేకరించాలి. నేల పొడిగా ఉన్నప్పుడు పొలం ఆరి ఉండేటప్పుడు మార్చి నుంచి మే నెల వరకు తీసుకోవాలి. పండ్ల తోటలు సాగు చేసే రైతులు చెట్లకు ఎలాంటి ఎరువు చల్లక ముందే, మట్టి నమూనాలు సేకరించాలి.
మట్టి తీసే లోతు..
రైతులు వ్యవసాయ అధికారులు, కేవీకే శాస్త్రవేత్తలు సూచన మేరకు మట్టి సేకరించాలి. మొక్కల వేర్లు వెళ్లేలోతు వరకు ఏక వార్షిక పంటలకు 15 నుంచి 30 సెం.మీ వరకు మట్టి నమూనాలు సేకరించాలి.