చిన్నశంకరంపేట,జూన్ 23 : పాత కక్షలకు రెండు నిండు ప్రాణాలు బలి అయ్యాయి. పరస్పర హత్యలతో సూరారం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన యాటశ్రీధర్(24)ను ఇదే గ్రామానికి చెందిన రణబోయిన ప్రభాకర్ తన మిత్రులతో కలసి చేగుంట మండలం అనంతసాగర్ వద్ద పాతకక్షలతో ఆటో గుద్ది సోమవారం అతిదారుణంగా హత్యచేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీధర్ కుటుంబ సభ్యులు, ప్రభాకర్ తండ్రి యాదగిరి(53) తూప్రాన్లో ఓహోటల్లో భోజనం చేస్తుండగా పట్టుకెళ్లి, కిరాతకంగా హత్యచేసి మృతదేహానికి పెద్ద బండరాయిని కట్టి వెల్దుర్తి మండలం కొప్పులపల్లి గ్రామశివారులోని హల్దీవాగులో పడేశారు.
అదే రాత్రి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గతంలో శ్రీధర్,ప్రభాకర్ మంచి స్నేహితులు. ఆటో ఫైనాన్స్ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరగగా, ఆ విషయాన్ని గ్రామ పెద్దల సమక్షంలో పరిష్కరించుకున్నారు. 15 రోజుల క్రితం శ్రీధర్ బంధువుల అమ్మాయిని ప్రభాకర్ ప్రేమవివాహం చేసుకున్నాడు. దీంతో వారి మధ్య మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయి. గంటల వ్యవధిలో రెండు హత్యలు జరగడంతో సూరారంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చిన్నశంకరంపేట ఎస్సై శివానందం ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. సూరారం గ్రామాన్ని తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ సందర్శించారు. గ్రామస్తులు సంయమనం పాటించాలని సూచించారు.చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే అనవసరంగా కేసుల పాలై జైలుకు వెళ్లాల్సిస వస్తుందని హెచ్చరించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు.