మెదక్ : అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని రాష్ట్ర పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రగతి పథంలో దూసుకుపోతున్నదని పేర్కొన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన వేడుకలకు మంత్రి తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అనంతరం ఆయన మాట్లాడారు. ‘రైతేరాజు అనే నినాదాన్ని సాకారం చేయాలనే లక్ష్యంతో వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది.
పంట పెట్టుబడి కోసం రైతుబంధు పథకం ద్వారా అన్నదాతలకు ఎకరానికి రూ. 5 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తున్నది. రైతులను సంఘటితం చేసేందుకు రైతు వేదికల నిర్మించాం. కులవృత్తులకు చేయూతను అందిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. మత్స్యకారుల అభివృద్ధి కోసం ఉచితంగా చేప పిల్లల పంపిణీ, సబ్సిడీపై వాహనాలను అందజేస్తున్నది. గొల్ల, కురుమలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తున్నది. దళితుల జీవితాలలో వెలుగులు నింపాలని, వారి జీవితాలను బాగు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
ఈ నెల 16న హుజూరాబాద్ నుంచి పథకం ప్రారంభంకానుంది. అర్హులైన దళిత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని’ మంత్రి తలసాని తెలిపారు. అంతకుముందు పలువురు స్వాతంత్య్ర సమరయోధులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. వేడుకల్లో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, కలెక్టర్ హరీష్, జడ్పీ చైర్మన్ హేమలత, ఎస్పీ చందనా దీప్తి, పలువురు ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.