సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 4: సంగారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాలకు కలెక్టర్ శరత్ శుక్రవారం గెజిట్ విడుదల చేశారు. ఈ మేరకు జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం దుకాణాలకు గెజిట్ విడుదలైన నేపథ్యంలో శుక్రవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందన్నారు. ఈ నెల 18న సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ మేరకు జిల్లాలో 2023-25కు గాను నూతన మద్యం పాలసీ ద్వారా రిజర్వేషన్లను కలెక్టర్ శరత్ ఖరారు చేశారన్నారు. 2023 డిసెంబర్ 1 నుంచి 2005 నవంబర్ 30 వరకు రెండేండ్ల వ్యవధికి ఈ పాలసీ అమలుకానున్నదన్నారు. జిల్లాలో మొత్తం 101 మద్యం దుకాణాల్లో 24కు రిజర్వేషన్లు ఖరారు చేశామని, మిగతా 77 దుకాణాలు జనరల్ కేటగిరీకి కేటాయించామని తెలిపారు. మద్యం దుకాణాలు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తామన్నారు. 2011 జనాభాలో దామాషా పద్ధతి ప్రకారం కేటాయింపులు జరిగాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులు దరఖాస్తు చేసుకునే సమయంలో విధిగా కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలని స్పష్టం చేశారు. అందుబాటులో లేని వారు లక్కీ డ్రా తీసే సమయానికి ధ్రువీకరణ పత్రం లేనివారు, ఈనెల 31 వ తేదీ వరకు సమర్పించవచ్చని తెలిపారు. అందుకు అఫిడవిట్ దరఖాస్తుతో పాటు సమర్పించాల్సి ఉంటుందన్నారు.
దరఖాస్తు చేసుకోవడం సులభతరం
గతంలో కంటే ఈ ఏడాది మద్యం దుకాణాల దరఖాస్తులను ప్రభుత్వం సులభతరం చేసిందని హరికిషన్ వెల్లడించారు. 2019 వరకు ఒక వ్యక్తికి ఒకే దుకాణం, ఒక దరఖాస్తు మాత్రమే చేసుకునే అవకాశం ఉండేదని, ఈ విధానం కఠినంగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈసారి ఒక దరఖాస్తుదారుడు ఎన్ని దుకాణాలకైనా, ఏ జిల్లాలోనైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నదన్నారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 101 మద్యం దుకాణాలకు 6 డివిజన్ల వారీగా సంగారెడ్డి స్టేషన్ పరిధిలో 23 దుకాణాలు, జహీరాబాద్లో 17, అందోల్ 14, నారాయణఖేడ్ 13, పటాన్చెరు స్టేషన్ పరిధిలో 34 దుకాణాలు ఉన్నాయన్నారు. దరఖాస్తులను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా కార్యాలయంలో గెజిట్ వారీగా ఈ నెల 18 సాయంత్రం 6 గంటల వరకు స్వీకరించనున్నామని తెలిపారు. దరఖాస్తు రుసుం రూ.2 లక్షలతో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డుతో ఒక్కో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఆబ్కారీ శాఖ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మాణెమ్మ, సీఐలు మధుబాబు, అశోక్, శంకర్, మహేశ్ పాల్గొన్నారు.
మెదక్ జిల్లాలో..
మెదక్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): మూడు నెలల ముందుగానే ఎక్సైజ్ నూతన పాలసీ అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే మద్యం కొత్త పాలసీకి టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 49 మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించనున్నారు. 2023 డిసెంబర్ 1 నుంచి 2025 నవంబర్ 30 వరకు ఈ పాలసీ అమలులో ఉంటుంది. జిల్లాలో 49 మద్యం దుకాణాలున్నాయి. రిజర్వేషన్ల ప్రకారం ఎస్టీలకు 1, ఎస్సీలకు 6, గౌడలకు 9 దుకాణాలు కేటాయించారు. 33 దుకాణాలు ఓపెన్ కేటగిరీ కింద కేటాయించారు.
జిల్లాలో రెండు స్లాబులుగా ..
జిల్లాలో రెండు స్లాబులుగా లైసెన్స్ ఫీజులు విధించారు. 5 వేల లోపు జనాభా ఉన్న గ్రామాల్లో లైసెన్స్ ఫీజు రూ.50 లక్షలు, 5 నుంచి 50 వేల లోపు ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మెదక్ జిల్లాలో 17 షాపులు రూ.50 లక్ష లు, 32 షాపులు రూ.55 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉం టుంది. ఈ నెల 4 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 21న జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర గార్డెన్స్లో డ్రా తీయనున్నారు. లక్కీడిప్ ద్వారా దుకాణాలు కేటాయిస్తారు. దుకాణం దక్కించుకున్న వారు వెంటనే ఏడాది లైసెన్స్ ఫీజులో 1/6 వంతు చెల్లించాల్సి ఉంటుంది. ఆరు విడతల్లో లైసెన్స్ ఫీజు చెల్లించాలి. దుకాణాలు దక్కించుకున్న వారికి డిసెంబర్ 1 నుంచి దుకాణాలు కేటాయిస్తారు.