మెదక్, మే 23 (నమస్తే తెలంగాణ) : మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఏటా గంగపుత్రులకు ఉచితంగా చేపపిల్లలను అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి పాటు పడుతున్నది. ఈ ఏడాది వానకాలంలో మెదక్ జిల్లాలోని 1614 చెరువుల్లో 5 కోట్ల 4లక్షల చేపపిల్లలను వదలాలని నిర్ణయించింది. ఇందుకోసం చేప విత్తనాలను సరఫరా చేసేందుకు ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది. కాంట్రాక్టర్ల ఎంపిక కోసం కలెక్టర్ నేతృత్వంలో పశు సంవర్థకశాఖ, మత్య్సశాఖ, సహకారశాఖ అధికారులతో ప్రత్యేక బృందాన్ని నియమించారు. వర్షాలు కురిసి చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చిన వెంటనేజూలై చివరివారంలో బొచ్చె, రాహు, బంగారుతీగ తదితర రకాలను వదిలేలా కసరత్తు చేస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా మొత్తం 263 మత్య్సపారిశ్రామిక సహకార సంఘాలుండగా, వీటిల్లో 15,754 మంది సభ్యులు ఉన్నారు. చేపలను విక్రయించేటప్పుడు ఇబ్బందులు లేకుండా సొసైటీ సభ్యులకు 2980 మోపెడ్లు, 683 వలలు, 597 డబ్బాలు, 21 టెంట్లు, 156 లగేజీ ఆటోలు, 24 సంచార వాహనాలు, చేపలను తరలించేందుకు కావాల్సిన పెద్ద ట్రక్ను ప్రభుత్వం ఇప్పటికే సబ్సిడీపై అందజేసింది. – మెదక్, మే 23 (నమస్తే తెలంగాణ)మెదక్ జిల్లాలోని చెరువుల్లో ఈ వానకాలం చేప పిల్లలను వదలేందుకు మత్స్యశాఖ యంత్రాంగం కార్యాచరణ ఖరారు చేసింది. చేప పిల్లల సరఫరా కోసం టెండర్లను ఇప్పటికే ఆహ్వానించింది. చెరువుల్లో చేప పిల్లలను వదలడం ద్వారా మత్స్యకారులకు ఉపాధి కల్పించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. దీనికి అనుగుణంగా మత్స్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. త్వరలోనే టెండర్ ఖరారు చేసి వర్షాలకు అనుగుణంగా చెరువులు నిండాక చేప పిల్లల సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టనున్నారు.
15,754 మంది మత్స్యకారులకు ఉపాధి..
మెదక్ జిల్లావ్యాప్తంగా 263 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 15,754 మంది సభ్యులున్నారు. వంద శాతం రాయితీతో ఉచితంగా చేప పిల్లలను వదలడం ద్వారా వీరందరికీ ఉపాధి లభించి తద్వారా లబ్ధి పొందనున్నారు. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల సామర్థ్యానికి అనుగుణంగా చేప పిల్లలను వదలనున్నారు. ఇందుకోసం టెండర్లను దాఖలు చేసిన కాంట్రాక్టర్లలో అర్హులను ఎంపిక చేసేందుకు జిల్లా అదనపు కలెక్టర్ నేతృత్వంలో పశు సంవర్థకశాఖ, మత్స్యశాఖ, సహకారశాఖ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని నియమించారు.
5 కోట్ల 4 లక్షల చేప పిల్లలు…
జిల్లాలో 1614 చెరువుల్లో 5 కోట్ల 4 లక్షల చేప పిల్లలు పంపిణీ చేయాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. చెరువుల్లో చేప పిల్లలు వేయడంతో మత్స్యకారులకు ఉపాధి లభించనున్నది. చెరువులు, కుంటల్లో బొచ్చె, రాహు, బంగారుతీగ రకాలను పంపిణీ చేయనున్నారు. అయితే గత ఏడాది ఆగస్టు నెల నుంచి చేప విత్తనాలను ప్రభుత్వం పంపిణీ చేయగా, ఈ ఏడాది జూలైలోనే చేప పిల్లలను వదిలేలా చర్యలు చేపడుతున్నారు.
మార్కెటింగ్కు ఇబ్బంది లేకుండా…
మత్య్సకారులకు చేపలను మార్కెట్, ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తరఫున సబ్సిడీ వాహనాలను కూడా అందజేశారు. ఇప్పటికే జిల్లాలోని మత్స్యకార సొసైటీ సభ్యులకు సబ్సిడీపై వాహనాలు అందించారు. ఇందులో 2980 మోపెడ్లు, వలలు 683 మందికి, డబ్బాలు 597 మందికి, టెంట్లు 21, లగేజ్ ఆటోలు 156, 24 సంచార చేపల వాహనాలు, చేపలను తరలించేందుకు కావాల్సిన పెద్ద ట్రక్ను సబ్సిడీపై అందజేశారు.
టెండర్ల ప్రక్రియ ప్రారంభం..
జిల్లాలోని చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో 5 కోట్లకు పైగా చేప పిల్లలను వదలనుండడంతో ఇప్పటికే ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లను పిలిచారు. ఇందుకుగానూ సీడ్ కంపెనీలు టెండర్లు దాఖలు
చేస్తున్నాయి. ఈ నెల 17 నుంచి ప్రారంభమైన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ 31 వరకు కొనసాగనున్నది. జూలైలో టెక్నికల్ బిడ్స్ ఓపెన్ చేసి కంపెనీల అర్హతను పరిశీలించనున్నారు. ఆ తర్వాత జిల్లా అదనపు కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఈ కంపెనీలను పిలిచి ఫైనల్ చేయనున్నారు.
జూలై చివరి వారంలో పంపిణీకి ఏర్పాట్లు..
మెదక్ జిల్లాలో 1614 చెరువుల్లో 5 కోట్ల 4 లక్షల చేప పిల్లలను వదిలేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. 263 సొసైటీలు ఉండగా, 15,754 మంది మత్య్సకారులున్నారు. జూలై చివరి వారంలో లేదా ఆగస్టులో చేప పిల్లలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. నాణ్యమైన చేప విత్తనాలను పంపిణీ చేసేలా చూస్తున్నాం. జిల్లానీలి-విప్లవం-2లో నీలి-విప్లవం-2 మత్య్సకారులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.
– మల్లేశం, మత్య్సశాఖ జిల్లా అధికారి