అభయహస్తం నిధులు మిత్తితో సహా అర్హుల ఖాతాల్లో జమ
సంగారెడ్డి జిల్లాలో 62 వేల మందికి రూ.16 కోట్లు వాపస్
రుణాల పంపిణీలో ప్రథమస్థానంలో జిల్లా
ఈ నెల నుంచి అర్హులకు కొత్త పింఛన్ల పంపిణీ
ఆర్థిక,వైద్యరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు, పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
సంగారెడ్డిలో అభయహస్తం చెక్కుల పంపిణీ
మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి అభయ హస్తం నిధుల చెల్లింపు, బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్యాంకు లింకేజీల్లో సంగారెడ్డి జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో ఉందన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ అభయహస్తం పథకం కింద గతంలో నిధులు జమచేసిన మహిళలందరికీ తిరిగి వడ్డీతో సహా డబ్బులు వాపస్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు.
సంగారెడ్డి, ఏప్రిల్ 17: మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇచ్చే రుణాల పంపిణీలో సంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సూచించారు. ఆదివారం సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో అభయహస్తం నిధులు వాపసు, బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి రుణాల చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దయాకర్రావు, హరీశ్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రులను గజమాలతో డీఆర్డీవో సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల రూ.72 కోట్ల చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులకులు రూ.500ల పింఛన్ ఇచ్చే వారన్నారు. పింఛన్ కోసం ప్రతినెలా అభయహస్తంలో జమ చేసేందుకు, పొందుడేందుకని సీఎం కేసీఆర్ గుర్తించి వాపసు చేసే కార్యక్రమం తీసుకొచ్చారన్నారు.
ఒకప్పుడు మహిళా సంఘాలకు కేవలం రూ.50వేలు, రూ.లక్ష, రూ.3 లక్షలు మాత్రమే రుణాలు ఇచ్చేవారన్నారు. ప్రస్తుతం తెలంగాణ పాలనలో ఒక సంఘానికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బ్యాంకు రుణాలు తీసుకుంటున్నారన్నారు. మహిళా సంఘాలు బ్యాంకుల్లో తీసుకున్న అప్పులను తిరిగి సకాలంలో చెల్లించడంతో మళ్లీ రుణాలు ఇస్తున్నారన్నారు. బ్యాంకు లింకేజీల్లో సంగారెడ్డి జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. రూ.672 కోట్ల రుణాలు మహిళా సంఘాలు తీసుకున్నారన్నారు. ఇందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, సిబ్బంది పనితీరుతో సాధ్యమైందని మంత్రి అభినందించారు. మహిలలకు అన్ని రకాలుగా తెలంగాణ సర్కారు అండగా ఉంటున్నదని అన్నారు. ఆడపిల్లల పెండ్లీళ్లకు కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్షా 116 లను పెండ్లి కూతురు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. ప్రభుత్వ దవానాల్లో మెరుగైన వసతులు పెంచామని, వైద్యసేవలు పొందాలని సూచించారు. గర్భిణులు ప్రభుత్వ దవాఖానలో కాన్పు అయితే కేసీఆర్ కిట్టుతో పాటు ఆడపిల్ల పుడితే రూ.13 వేల నగదు, మగ పిల్లవాడు పుడితే రూ.12వేల నగదు అందిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్దేనన్నారు.
సంగారెడ్డి, జోగిపేట, పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్లలో వసతి పెంచామన్నారు. ఇప్పటికే నారాయణఖేడ్లో 50 పడకల మాతశిశు దవాఖాన పూర్తై ప్రారంభింకుటామని మంత్రి తెలిపారు. జహీరాబాద్ ఎమ్మెల్యే కోరిక మేరకు త్వరలో రూ.12 కోట్లతో మాతాశిశు దవాఖానను మంజూరు చేస్తామన్నారు. పుట్టిన బిడ్డకు మొదటి గంటలో ముర్రుపాలు తాగితే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని, అపుడే పట్టిన బిడ్డలు ఆరోగ్యవంతులుగా పెరుగుతారని మంత్రి సూచించారు. కార్యక్రమంలో లేబర్ వేల్ఫేర్ చైర్మన్ దేవేందర్రెడ్డి, పంచాయతీరాజ్ డైరెక్టర్ శరత్ నాయక్, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లతా, ఎంపీపీ లావణ్య, జడ్పీటీసీలు సునీతా, పద్మావతి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, అదనపు కలెక్టర్ రాజర్షి షా, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్రావు, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్, ఆర్డీవో మెంచే నగేశ్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి
రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ ఆడపడుచులకు మేనమామగా సీఎం కేసీఆర్ అవతరమెత్తారన్నారు. మహిళా సాధికారతకు సీఎం కృషి చేస్తున్నారన్నారు. అభయహస్తం పథకంలో గతంలో నిధులు జమ చేసిన మహిళలందరికీ మిత్తితో సహా వాపసు కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారన్నారు. సంగారెడ్డి జిల్లా నుంచే ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలో 62 వేలమంది మహిళలు రూ.16 వేలు చెల్లించారని, వారందరికీ వాపసు చేసే కార్యక్రమం ప్రారంభమైందని అన్నారు. స్త్రీనిధిలో అప్పు తీసుకుని మధ్యలో మృతి చెందితే, ఎవరు చెల్లించాలని సీఎంను అడిగితే ఎవరూ కట్టనవసరం లేదని పూర్తిగా మాఫీ చేస్తామని భరోసా ఇచ్చారన్నారు. అంతేగాకుండాసగం రుణాలు చెల్లించిన వారికి వాపసు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారని మంత్రి గుర్తుచేశారు. దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో వృద్ధ్దాప్య, వితంతువు, చేనేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలకు నెలకు రూ.2 వేల పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రమన్నారు.
– ఎర్రబెల్లి దయాకర్రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి