సంగారెడ్డి (నమస్తే తెలంగాణ)/సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 24: ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పాఠశాల విద్యా ప్రాంతీయ సంయుక్త సంచాలకుల ఆదేశాల మేరకు జిల్లాలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల కేటగిరీ ఉద్యోగోన్నతులకు జిల్లా విద్యాశాఖ చర్యలు మొదలుపెట్టింది. జిల్లాలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్, తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయుల తాత్కాలిక సీనియారిటీ జాబితాను విద్యాశాఖ అధికారులు తయారు చేశారు. అందుకు సంబంధించిన జాబితాను http://deosanga reddy.inలో పొందుపర్చారు. స్కూల్ అసిస్టెంట్, తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయుల ఒరిజినల్ సర్టిఫికెటుల, సర్వీసు రిజిస్టర్ వెరిఫికేషన్ను ఈ నెల 25న (నేడు) ఉదయం 10 గంటల నుంచి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించనున్నారు. నిర్దేశించిన కట్ ఆఫ్ తేదీల్లో స్కూల్ అసిస్టెంట్/తత్సమాన కేటగిరీలుగా నియామకం పొందిన ఉపాధ్యాయులు బుధవారం ఉదయం నిర్వహించే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే ఉపాధ్యాయులు తమ వెంట ఒరిజినల్ సర్వీసు బుక్, ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ, బీఎడ్, పండిత్ ట్రైనింగ్ ఒరిజినల్ సర్టిఫికెట్లు, డిపార్ట్మెంటల్ పరీక్ష రిజల్ట్, ఎస్సీ, ఎస్టీ ఒరిజినల్ సర్టిఫికెట్, పీహెచ్సీ అయితే పీహెచ్సీ సర్టిఫికెట్లతో తప్పనిసరి హాజరుకావాల్సి ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్ స్పష్టం చేశారు.
ఉపాధ్యాయులు సకాలంలో హాజరు కావాలి
జిల్లాలో స్కూల్ అసిస్టెంట్, తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులను గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి కల్పించేందుకు ప్రక్రియ మొదలైంది. పాఠశాల విద్యా జాయింట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో నిర్వహిస్తాం. నిర్దేశించిన కట్ ఆఫ్ తేదీల్లో స్కూల్ అసిస్టెంట్/తత్సమాన కేటగిరీలుగా నియామకం పొందిన ఉపాధ్యాయుల ధ్రువపత్రాలను పరిశీలిస్తాం. అర్హులైన ఉపాధ్యాయులు సకాలంలో హాజరుకావాలి. నిర్దేశించిన వివిధ ఒరిజినల్ ధ్రువపత్రాలను వెంట తెచ్చుకోవాలి. అర్హుల తాత్కాలిక జాబితాను ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారి వెబ్సైట్లో పొందుపరిచాం.
– నాంపల్లి రాజేశ్, డీఈవో, సంగారెడ్డి