గజ్వేల్, మే 20: ఎంతో మంది పేదలు విలువైన వైద్యం చేయించుకోలేని వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడింది. ప్రస్తుతం ఎంతోమంది గ్రామీణ ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. కిడ్నీవ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయించుకోవాలంటే హైదరాబాద్లోని గాంధీ లేక ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయించాల్సిన పరిస్థితి గతంలో ఉండేది. నేడు ప్రభుత్వం గ్రామీణ ప్రాంత రోగులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ దవాఖానల్లో కూడా డయాలసిస్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో ఎంతో మందికి విలువైన వైద్యం ఉచితంగా అందుతున్నది. గజ్వేల్లో రూ.21.30 కోట్లతో నూతనంగా నిర్మించిన దవాఖానలో ఎనిమిది యూనిట్లతో డయాలసిస్ సేవలు ప్రారంభించగా నేటి వరకు సుమారు 32,500 సెషన్ల సేవలు అందించారు.
గజ్వేల్ జిల్లా దవాఖానలో 2018 అక్టోబర్ 26న ఎనిమిది యూనిట్లతో డయాలసిస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు దవాఖానలో 32,500 సెషన్ల వరకు డయాలసిస్ సేవలు అందించగా 76 మంది ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. గజ్వేల్ ఏరియా దవాఖానకు రోజూ చికిత్స కోసం వచ్చే వారికి వసతులు సరిపోవడం లేదని గుర్త్తించిన సీఎ కేసీఆర్ నూతనంగా కొత్తగా రెండంతస్తుల భవనం నిర్మించారు. అందులోనే ప్రత్యేకంగా డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడంతో హైదరాబాద్లో డయాలసిస్ చేయించుకునే వారికి ఎంతో లాభం చేకూరే విధంగా ఉచిత వైద్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేదలు వైద్య సేవలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గజ్వేల్ దవాఖానలో 2018లో డయాలసిస్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడంతో గజ్వేల్ నియోజకవర్గంతో పాటు నర్సాపూర్. చేగుంట, దౌల్తాబాద్, దుబ్బాక, యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట, భువనగిరి, తుర్కపల్లి ప్రాంతాలకు చెందిన కిడ్నీ బాధితులు వచ్చేవారు. ప్రభుత్వం డయాలసిస్ సేవలను ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ దవాఖానల్లో విస్తరించడంతో గజ్వేల్ దవాఖానలో 76 మంది మాత్రమే డయాలసిస్ సేవలను వినియోగించుకుంటున్నారు. అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్రావుకు బాధితులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
దుబ్బాక, మే 20: ప్రజారోగ్యమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దుబ్బాకపై మమకారంతో సీఎం కేసీఆర్ రూ.20 కోట్లు మంజూరు చేసి కార్పొరేట్ తరహాలో సకల వసతులతో కూడిన ‘వంద పడకల దవాఖాన’ భవన నిర్మాణం చేపట్టారు. దీంతో దుబ్బాక నియోజకవర్గ ప్రజలతో పాటు పక్క జిల్లాలైన కామారెడ్డి, మెదక్ , రాజన్న సిరిసిల్ల జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలందుతున్నాయి. కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలపై స్పందించిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఈ విషయాన్ని మంత్రి తన్నీరు హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మంత్రి హరీశ్రావు దుబ్బాకకు డయాలసిస్ సెంటర్ మంజూరు చేశారు. గత 2 నెలల కిందట (మార్చి5న) వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు దుబ్బాక వంద పడకల దవాఖానలో డయాలసిస్ సెంటర్ ప్రారంభించారు. అప్పటి నుంచి దుబ్బాక నియోజకవర్గంతో పాటు పక్క జిల్లాలకు చెందిన కిడ్నీవ్యాధిగ్రస్తులు ఉచితంగా డయాలసిస్ సేవలు పొందుతున్నారు. దుబ్బాకలో నిర్మించిన వంద పడకల దవాఖాన కేవలం దుబ్బాక నియోజకవర్గ ప్రజలకే కాకుండా పక్క జిల్లాల (మెదక్, రాజన్న సిరిసిల్ల, కామరెడ్డి జిల్లాలు) సరిహద్దు గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలందుతున్నాయి. సామాజిక ఆరోగ్య కేంద్రం(కమ్యూనిటీ హెల్త్ సెంటర్)లో నిత్యం వందలాది మందికి వైద్య సేవలందిస్తున్నారు. ప్రధానంగా ప్రసూతి వైద్య సేవలకు ‘దుబ్బాక దవాఖాన’ ప్రత్యేక గుర్తింపు పొందింది.
హుస్నాబాద్, మే 20: హుస్నాబాద్లోని సర్కారు సామాజిక ఆరోగ్య కేంద్రంలో కొత్తగా ప్రారంభించిన డయాలసిస్ సెంటర్లో మెరుగైన చికిత్సలు అందుతున్నాయి. సెంటర్ వైద్యులు, సిబ్బంది కిడ్నీ బాధితులకు నాణ్యమైన డయాలసిస్ చేస్తూ నిరంతరం అందుబాటులో ఉంటూ బాధితుల్లో భరోసా కల్పిస్తున్నారు. ఒకప్పుడు పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైన డయాలసిస్ సెంటర్లు ప్రభుత్వం కృషితో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు కావడం విశేషం. డిసెంబర్ 5, 2022న హుస్నాబాద్ దవాఖానలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే సతీశ్కుమార్తో కలిసి సెంటర్ను ప్రారంభించడంతో కిడ్నీ రోగులకు వరంగా మారింది. సెంటర్ ప్రారంభించిన కేవలం ఐదు నెలల్లోనే 31మంది కిడ్నీ బాధితులకు 1,237 సెషన్స్లో డయాలసిస్ చికిత్సలు అందించడం హర్షణీయం. అపెక్స్ కిడ్నీ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ సెంటర్ను నిర్వహిస్తున్నారు. కిడ్నీ బాధితులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యాధునిక పరికరాలతో డయాలసిస్ చేస్తున్నారు. తక్కువ కాలంలోనే ఎక్కువ మంది కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేస్తున్న దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రమేశ్రెడ్డి, సెంటర్ ఇన్చార్జి అనిల్, ఇతర సిబ్బంది భానుప్రకాశ్, సాయిచరణ్, సుకన్య, హరీశ్, సాయికుమార్, ఆరోగ్యమిత్ర రమేశ్ పనితీరుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. డయాలసిస్ సెంటర్ను అందుబాటులోకి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే సతీశ్కుమార్కు ఈ ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఆరేండ్ల కిందట కిడ్నీ సమస్య తలెత్తింది. ఇందుకు డయాలసిస్ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. డయాలసిస్ కోసం మొదట హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చేది.డయాలసిస్కు పోయినప్పుడు రూ.3 వేల వరకు ఖర్చు అయ్యేది. నెలలో ఏడుసార్లు డయాలసిస్ చేయించుకునేది, ఇందుకు నెలకు రూ.20 వేలకుపైగా ఖర్చు వచ్చేది. ఆ తర్వతా సిద్దిపేట సర్కారు దవాఖానలో రెండేండ్లు డయాలసిస్ చేయించుకున్నా. ప్రస్తుతం దుబ్బాక సర్కారు దవాఖానలో డయాలసిస్ చేయించుకుంటున్నా.దవాఖానలో సౌలత్లు మంచిగా ఉన్నాయి. వైద్య సిబ్బంది దగ్గరుండి చూసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మంత్రి హరీశ్రావు సహకారంతో దుబ్బాకలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– నేరేండ్ల యాదగౌడ్, మిరుదొడ్డి
సిద్దిపేట, మే 20: గతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయించుకోవడానికి హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లేవారు. కిడ్నీ బాధితుల కోసం సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రాల్లోని సర్కారు దవాఖానల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు చొరవతో సిద్దిపేటలో డిమేడ్ కంపెనీ సహకారంతో డయాలసిస్ సెంటర్ను 18 ఆగస్టు 2017లో ఏర్పాటు చేసి 28ఆగస్టు 2017లో డయాలసిస్ ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటి వరకు 61443 సెషన్ల డయాలసిస్ సేవలు అందజేశారు. వీరిలోఈహెచ్ఎస్ కింద10 మంది రోగులు,ఆరోగ్యశ్రీ కింద 92 మందికి చికిత్స చేస్తున్నారు. మరో నాలుగు నుంచి ఐదుగురు వెయిటింగ్ జాబితాలోఉన్నారు. ఒక వ్యక్తికి డయాలసిస్ చేయడానికి నాలుగు గంటల సమయం పడుతున్నది. రోజుకు 30 మందికి డయాలసిస్ సేవలు అందుతున్నాయి.
ఐదు సంవత్సరాలుగా సిద్దిపేట డయాలసిస్ సెంటర్లో డయాలసిస్ చేయించుకుంటున్నా. గతంలో హైదరాబాద్కు వెళ్లే పరిస్థితి ఉండేది. రవాణా చార్జీలు, ఇతర ఖర్చులు నెలకు రూ. 6000 వరకు అయ్యేది. ఇప్పుడు సిద్దిపేట ప్రభుత్వ డయాలసిస్ సెంటర్లో ఉచితంగా డయాలసిస్ చేస్తున్నారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటా.
– కె.సురేశ్, కిడ్నీవ్యాధిగ్రస్తుడు, సిద్దిపేట
గజ్వేల్ దవాఖానలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సేవలను ఉచితంగా అందిస్తున్నాం. డయాలసిస్ ఇన్చార్జి, టెక్నిషియన్, స్టాఫ్ నర్సుల పర్యవేక్షణలో వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 76 మంది ఇక్కడ తమ సేవలు వినియోగించుకుంటున్నారు. ఉచిత సేవలపై ఇక్కడికి వచ్చే వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కిడ్నీ బాధితులతో స్నేహపూర్వకంగా ఉంటూ ప్రభుత్వ వైద్య సేవలను
విస్తృత పరుస్తున్నాం.
– నవీన్, డయాలసిస్ సెంటర్ ఇన్చార్జి, గజ్వేల్