మన ఊరు-మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయని, పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు, నాణ్యమైన విద్యనందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మెదక్, సంగారెడ్డి కలెక్టర్లు, జడ్పీచైర్పర్సన్లు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యాదినోత్సవాన్ని పండుగలా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాలను ఆవిష్కరించి, విద్యావ్యవస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారు వివరించారు. మనఊరు-మనబడి కింద పనులు పూర్తయిన పాఠశాలలను ప్రారంభించారు. విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు ఇవ్వడంతో పాటు ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. కుల, నివాస, ఆదాయ ధ్రువపత్రాలు అందజేశారు. మెదక్ జిల్లా రామాయంపేట ప్రాథమిక పాఠశాలలో రాగిజావ పంపిణీని ప్రారంభించారు. పలుచోట్ల నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గ్రామాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టి విద్యపై ప్రజలకు అవగాహన కల్పించారు.
– సంగారెడ్డి/ మెదక్ న్యూస్నెట్వర్క్, జూన్ 20
శివ్వంపేట, జూన్ 20: రాష్ట్ర ముఖ్యమంత్రి మనసు పెట్టి ఏ కార్యక్రమం ప్రారంభించినా అది విజయవంతమవుతుందని నర్సాపూర్ శాసనసభ్యుడు మదన్రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శివ్వంపేట మండలం పోతులబొగుడలో విద్యాదినోత్సవం నిర్వహించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన ఊరు-మన బడి కింద ప్రాథమిక పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అందజేయడంతోపాటు రాగి జావ పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా రంగంలో సంస్కరణల ద్వారా సమూల మార్పులు తీసుకువచ్చారని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలే లక్ష్యంగా పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకొని అమలు చేస్తున్నారని చెప్పారు. పోతులబొగుడలో రూ.22 లక్షలతో సుందరీకరించుకున్నామని చెప్పారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. నేడు జిల్లాలో పనులు పూర్తి చేసుకున్న 15 పాఠశాలలను ప్రారంభించుకున్నామని తెలిపారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ పిల్ల్లలను ప్రభుత్వ బడుల్లో ఎక్కువ సంఖ్యలో చేరేలా చూడాలన్నారు. అనంతరం దంతాన్పల్లిలోని మన ఊరు-మన బడి పాఠశాలను ఎమ్మెల్యే, మహిళా కమిషన్ చైర్పర్సన్, స్థానిక సర్పంచ్ కన్నారం దుర్గేశ్తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, సర్పంచ్ హరికిషన్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి, డీఈ రాధిక, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, బీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం, నీటి పారుదల డిప్యూటీ ఈఈ, తహసీల్దార్ శ్రీనివాసాచారి, ఎంపీడీవో నవీన్కుమార్, వేణుగోపాల్రెడ్డి, రాజశేఖర్గౌడ్, సర్పంచ్లు అశోక్రెడ్డి, చంద్రకళాశ్రీశైలం యాదవ్, గైనిబైటి శ్రీనివాస్గౌడ్, ఎంపీటీసీలు మర్రి సత్తిరెడ్డి, ఆకుల ఇందిరాశ్రీనివాస్ పాల్గొన్నారు.
కారక్రమంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అన్ని మౌలిక వసతులతో తీర్చిదిద్ది పేద విద్యార్థులకు చక్కటి బోధన అందించాలనే ఉద్దేశంతో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. భావిభారత పౌరులు ఆరోగ్యంగా ఉండాలనే తలంపుతో రాగి జావ ఇస్తున్నామని, మధ్యాహ్నం భోజనం పెడుతున్నామని, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ ఇస్తున్నామన్నారు. విద్యార్థులు మనసుపెట్టి చక్కగా చదువుకొని దేశం గర్వపడేలా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.