స్వరాష్ట్రంలో పండుగైన ఎవుసం సమైక్య పాలనలో దండగైన ఎవుసం స్వరాష్ట్రంలో పండుగైంది. పరాయి పాలనలో ఎద్దు ఏడ్చిన ఎవుసం స్వీయ పరిపాలనలో పద్ధతిగా ‘సాగు’తున్నది. ఓ రైతు తెలంగాణకు రాజయిండు! ఫలితంగా ప్రతి రైతు జీవితం రాజా బతుకైంది!!
మెదక్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రైతును రాజు చేయాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు క్షేమం గురించి ఆలోచిస్తూ రైతు సంక్షేమ పథకాలున అమలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. గత పాలనలో రైతుల ఆత్మహత్యలు ఎటూ చూసిన బీళ్లుగా కనిపించే పొలాలు కనబడేవి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతన్న తల రాతలు మారిపోయాయి. రైతులు ఏడాదికి రెండు పంటలు పండిస్తూ రాజులా జీవిస్తున్నారు.
మెదక్ జిల్లాలోని మెదక్, తూప్రాన్, నర్సాపూర్ డివిజన్ పరిధిలో వానకాలం పంటల సాగుకు సంబంధించిన ప్రణాళికలు వ్యవసాయ శాఖ రూపొందించింది. గత సీజన్లో 3.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ప్రస్తుతం 3.76 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కానున్నాయి. ఇదిలావుండగా వానకాలంలో సాగయ్యే పంటలకు అనుగుణంగా విత్తనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. 77,700 క్వింటాళ్లలో వరి విత్తనాలు అవసరం కానున్నాయి. 96.34 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కానున్నాయి. ఇదిలా ఉండగా, 2022లో 2,43,445 మంది రైతులకు రైతుబంధు కింద రూ.192.96 కోట్లు అందజేశారు. రైతుబీమా కింద 529 మంది రైతులకు రూ.26.45 కోట్లు రైతుబీమా అందజేసింది. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న రైతులకు ఆగస్టు 15, 2018 నుంచి రైతుబీమా కింద రూ.5 లక్షల బీమా లభిస్తోంది. ఏ రైతు మరణించినా కుటుంబానికి రూ.5 లక్షల బీమా కవరేజ్ను వ్యవసాయ శాఖ అందిస్తోంది. రైతుల తరపున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తోంది.
రైతులందరూ ఒక్కచోట చేరి తమ సాదక బాధకాలును చర్చించుకునేందుకు రైతు వేదికలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తోంది. రాష్ట్రం వచ్చిన తర్వాత సాగునీటి వసతి, 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమాను ప్రవేశపెట్టి రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. మెదక్ జిల్లాలో 76 రైతు వేదికలను నిర్మించారు.
రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన గోల్కొండ రాజయ్య 2018, ఆగస్టు 15న మొట్టమొదటి సారిగా అనారోగ్యానికి గురై దవాఖానలో చికిత్సలు పొందుతూ ఆరోగ్యం విషమించి మృత్యువాత పడ్డాడు. కడు పేదరికంలో ఉన్న మృతుడు రాజయ్య కుటుంబం చికిత్సల కోసం అప్పు చేసి లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ సార్ అప్పుడే ప్రవేశపెట్టిన రైతుబీమాను సంబంధిత అధికారులు మృతుడి గ్రామానికి వెళ్లి వ్యవసాయ పంట పొలాలను సందర్శించారు. పూర్తి స్థాయిలో సర్వేలు నిర్వహించి రైతు రాజయ్య కుటుంబానికి ఐదు రోజుల్లోనే రూ.5 లక్షల చెక్కు అందజేశారు. దీంతో అప్పుల్లో ఉన్న ఆ కుటుంబం ప్రభుత్వం అందజేసిన ఇన్సూరెన్సు డబ్బుతో అప్పులన్నీ తీర్చుకొని ప్రస్తుతం అప్పులు లేకుండా బతుకుతున్నారు.
నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన రైతు కాట్రోత్ పంతు 2018వ సంవత్సరంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కాట్రోత్ పంతుకు భార్య పున్నమ్మ, ముగ్గురు కుమారులున్నారు. పంతు బతికి ఉన్నప్పుడు సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ను రూ.3 లక్షలు అప్పు చేసి కొన్నాడు. ఇంటి నిర్మాణం కోసం కొంత అప్పు చేశాడు. పంతు మరణం అనంతరం కుటుంబం దిక్కు తోచని పరిస్థితుల్లో ఉండగా, రైతుబీమా కింద రూ.5 లక్షలు వచ్చాయి. మృతుడి భార్య ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చి, కాస్త స్థలం కూడా కొనుగోలు చేసింది.
– నర్సాపూర్, జూన్ 2