సిద్దిపేట, జూన్ 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ అవతరణ పండుగను జిల్లా ప్రజలు గుండెల నిండా అభిమానంతో నిర్వహించుకున్నారు. ఊరూవాడ, పల్లె, పట్నం అనే తేడా లేకుండా జనం ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు.
తెలంగాణ తల్లి విగ్రహాలకు పూల మాలలు వేసి అమరవీరులకు నివాళులర్పించారు. నియోజకవర్గం, మండల కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు వేడుకలను వైభవంగా నిర్వహించారు. ప్రతిచోటా జై తెలంగాణ, జయహో తెలంగాణ నినాదాలు మిన్నంటాయి.