పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని వ్యాఖ్యలు
రాజ్యసభ సాక్షిగా అసంబద్ధ మాటలు..
మోదీ తీరుపై తెలంగాణ ఉద్యమకారుల ఆగ్రహం
సంగారెడ్డి, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పాటు సరిగ్గా జరగలేదంటూ ఏకంగా రాజ్యసభలో మంగళవారం ప్రధాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన తీరుపై యావత్ తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. తెలంగాణ ఏర్పాటు ప్రజాస్వామ్యయుతంగా జరగలేదని, పార్లమెంట్ తలుపులు మూసి, మైక్లు బంద్చేసి రాష్ర్టాన్ని ఏర్పాటు చేశారంటూ ప్రధాని మాట్లాడారు. గతంలోనూ ఆయన ఇదే తరహా వ్యాఖ్యలు పార్లమెంట్లో చేశారు. ఆయన మాటలు తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను, అమరులను అవమానించేలా ఉన్నాయి. మోడీ వ్యాఖ్యలపై ఉమ్మడి మెదక్ జిల్లాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అన్నివర్గాలు ఖండిస్తున్నాయి. పలుచోట్ల మంగళవారం రాత్రి ప్రధాని దిష్టబొమ్మలను తగులబెట్టారు.
సమాఖ్య స్ఫూర్తిని కాలదన్ని తెలంగాణపై వివక్ష చూపుతున్న ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర విభజనపై మరోమారు తన అక్కసు వెళ్లగక్కారు. తెలంగాణ ఏర్పాటు సరిగ్గా జరగలేదంటూ విషం చిమ్మారు. రాజ్యసభలో మంగళవారం ప్రధాని మోడీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రజాస్వామ్యయుతంగా జరగలేదని, పార్లమెంట్ తలుపులు మూసి, మైక్లు బంద్చేసి తెలంగాణ ఏర్పాటు చేశారంటూ ఆయన విషం కక్కారు. గతంలోనూ మోదీ ఇదే తరహా వ్యాఖ్యలు పార్లమెంట్లో చేశారు.మోడీ వ్యాఖ్యలపై తెలంగాణతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులు మోడీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని హోదాలో నరేంద్రమోడీ తెలంగాణ ఏర్పాటుపై అసంబద్ధ వ్యాఖ్యలు చేయడం ఇక్కడి ప్రజలను అవమానించడమేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రధాని నరేంద్ర మోడీ విషం కక్కుతున్నారని, పార్లమెంట్ వేదికగా క్షుద్రరాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ ఉద్యమకారులు, యువకులు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కిన నరేంద్ర మోడీతో పాటు బీజేపీ నాయకులు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవిశ్రాంత పోరాట ఫలితంగా తెలంగాణ సిద్ధ్దించింది. తెలంగాణలో ఏ వ్యక్తినిని అడిగినా ఇదే సమాధానం వస్తుంది. 2001లో గుప్పెడు మందితో సిద్దిపేట గడ్డ నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ప్రారంభించారు. తెలంగాణలోని మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు అన్నివర్గాల ప్రజలను కలుపుకొని, 14 ఏండ్ల్లపాటు అవిశ్రాంతంగా తెలంగాణ కోసం పోరాటం చేశారు. ఓవైపు ఆంధ్ర రాజకీయ నాయకుల కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొంటూనే, మరోవైపు ఒక్క రక్తం బొట్టు చిందించకుండా, పూర్తిగా ప్రజాస్వామ్య యుతంగా తెలంగాణ కోసం ఉద్యమం నడిపారు కేసీఆర్. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించేందుకు సైతం కేసీఆర్ వెరవేలేదు.
2009లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి మరణం అంచువరకు వెళ్లారు. కేసీఆర్ ఆమరణ దీక్షతో దిగివచ్చిన అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఆ తర్వాత 2014లో అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరిగింది. ఆ తర్వాత పార్లమెంట్, రాజ్యసభలో తెలంగాణ ఏర్పాటుపై చర్చి జరిగింది. విపక్షంలో ఉన్న బీజేపీ సైతం తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఫలితంగా 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. కేసీఆర్ చేపట్టిన ఉద్యమ ఫలితంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం, ప్రస్తుతం ఆయన సారథ్యంలో అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నది. కేంద్రంలోని బీజేపీ సహకారం లేకుండా సీఎం కేసీఆర్ తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడుపుతున్నారు. రైతుబంధు, దళితబంధు, వ్యవసాయానికి ఉచిత కరెంటు, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, డబుల్ బెడ్రూం ఇండ్లు.. ఇలా అనే పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి. ప్రపంచమే ఆశ్చర్యపడేలా సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేసి తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నారు. తెలంగాణలోని ప్రాజెక్టులు, పథకాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం నిధులు కేటాయించడం లేదు. విభజన చట్టంలో తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు, ప్రాజెక్టులు, యూనివర్సిటీలను నరేంద్రమోడీ ప్రభుత్వం ఇవ్వడం లేదు. తెలంగాణపై మోడీ వివక్షను ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోడీ రాజ్యసభలో తెలంగాణ ఏర్పాటుపై అసంబద్ధ వ్యాఖ్యలు చేయడాన్ని యావత్ తెలంగాణ సమాజంతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని తెలంగాణ ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణను వ్యతిరేకంగా ఉన్న విషయం ఆయన మాటల్లోనే స్పష్టం అయ్యిందన్నారు. రాజ్యాంగానికి లోబడి, ప్రజాస్వామ్య యుతంగా తెలంగాణ ఏర్పాటు అయ్యిందని, ఈ విషయాన్ని అంగీకరించడకుండా మోడీ పదేపదే తెలంగాణపై విషం కక్కడం సరికాదని తెలంగాణ ఉద్యమకారులు, యువకులు, అన్నివర్గాల ప్రజలు హితబోధ చేస్తున్నారు. ప్రధాని మోడీ సహా బీజేపీ తెలంగాణ అమరవీరులను, తెలంగాణ ఉద్యమకారులను అవమానించారని, వారు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఉమ్మడి మెదక్ జిల్లాలోని తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ రావడం బీజేపీకి ఇష్టం లేదు..
తెలంగాణ రాష్ట్రం రావడం బీజేపీకి ఇష్టంలేదని ప్రధాని వ్యాఖ్యలతో స్పష్టం అవుతున్నది. అందుకే ఏడేండ్లుగా తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నది. పోరాడి, ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇదని గుర్తించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం దురదృష్టకరం అన్న రీతిన ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వందలాది అమరవీరుల త్యాగాలను కేంద్రం విస్మరిస్తున్నది. బీజేపీ ఉత్తరాది రాష్ర్టాలను మాత్రమే అభివృద్ధి చేస్తున్నది. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ర్టాలను అభివృద్ధి చేయకుండా, ఇక్కడి నుంచి వచ్చిన పన్నులను ఉత్తరాది రాష్ర్టాలను మళ్లిస్తూ అక్కడి అభివృద్ధికి వాడుకుంటున్నది. తెలంగాణలోని సింగరేణి, బీహెచ్ఈఎల్ వంటి సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం ఆలోచిస్తున్నది.
-వెంకటేశంగౌడ్, తెలంగాణ ఉద్యమకారుడు
కొత్త రాష్ర్టానికి ఇచ్చిందేమిటో చెప్పాలి..
ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ర్టానికి కేం ద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలి. రాజ్యసభలో ప్రధాన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఉద్యమకారులను కించపరిచేలా ఉన్నా యి. తెలంగాణలో జరిగిన అభివృద్ధ్ది, సంక్షేమ పథకాల అమలుని చూసి కేంద్ర బీజేపీ సర్కారు ఓర్వలేకనే చిల్లర మాటలు మాట్లాడుతున్నది. విభజన జరిగిన తెలుగు రాష్ర్టాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయని ప్రధాని మోడీ అనడం ఆయర స్థాయికి తగదు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి బీజేపీ నాయకులకు తెలియదా. ఇంత దిగజారి మాట్లాడితే ప్రజలు తరిమికొట్టే పరిస్థితి దగ్గర్లోనే ఉంది.
– శ్రీనివాస్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుడు
అవమానించారు..
14 ఏండ్ల పాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్లమెంట్లో ప్రధాని మోదీ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానం చేసుకున్న అమర వీరులను, పోరాడిన ఉద్యమకారులను మోడీ తన వ్యాఖ్యలతో అవమానించినట్లు భావిస్తున్నా. ఒక ఉద్యమకారుడిగా చెబుతున్నా. అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటూ పోరాడినం. చివరకు సీఎం కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సాధించడమే కాదు ఏర్పడిన కొత్త రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్వన్ స్థాయికి తీసుకుపోతున్నారు. సమాజాన్ని విచ్చిన్నం చేసే కుట్రలను ప్రజలెవరూ సహించరు.
– రవీందర్నాయక్, ఉద్యమకారుడు, పలుగుతండా, మండలం నారాయణఖేడ్