T-Fiber | మెదక్, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా ఇంటర్నెట్ సేవలు చాలా అవసరం. ఇప్పటికే మెదక్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టరేట్లోని ఆయా శాఖల్లో ఈ-ఆఫీస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో ప్రతి శాఖలో ఈ- ఆఫీస్ కార్యక్రమం పకడ్భందీగా కొనసాగుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలతో పాటు ప్రతి పనికి సాంకేతికతతో ముడిపడి ఉంది. ఇదిలావుండగా గత ప్రభుత్వం 2017లో ప్రతి గ్రామ పంచాయతీలో ఈ-పాలన, ఇంటింటికీ తక్కువ ధరకే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో టీ-ఫైబర్ సేవలకు శ్రీకారం చుట్టింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీ-ఫైబర్ సేవలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో చిన్న చిన్న పనులకు కూడా మండల కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఉన్నతాధికారులు స్పందించి గ్రామ పంచాయతీల్లో టీ-ఫైబర్ సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
పరికరాలు బిగించారు.. ప్రారంభం మరిచారు..
మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీల్లో అవసరమైన టీ-ఫైబర్ కేబుల్, పరికరాలను సైతం బిగించారు. విద్యుత్ సౌకర్యం కోసం సోలార్ ఫలకలు, ఇన్వర్టర్ బ్యాటరీలు అమర్చారు. సాంకేతిక సిబ్బంది పంచాయతీలకు వచ్చి టెస్టింగ్ కూడా చేశారు. అన్నీ బాగానే ఉన్నా ఇప్పటి వరకు ప్రారంభించకపోవడంతో గ్రామ పంచాయతీల్లో టీ-ఫైబర్ పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఇంటర్నెట్ సౌకర్యం లేక ఈ-పాలన మురుగుపడుతోంది. అంతేకాదు డిజిటల్ సేవలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పంచాయతీల్లో జాడలేని ఈ-పాలన…
మెదక్ జిల్లా వ్యాప్తంగా 469 గ్రామ పంచాయతీల్లో సుమారు 74 మంది ఈ-పంచాయతీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, నిధుల కేటాయింపు, ఆదాయం, వ్యయాలు, జీతభత్యాలు, జనన, మరణ ధ్రువపత్రాల జారీ, ఇంటి పన్ను తదితర సేవలను ప్రజలకు డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకురావాలన్నది ఈ-పాలన ప్రధాన ఉద్దేశం. అయితే పంచాయతీ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు డిజిటల్ సేవలు అందించాలని గతంలో క్లస్టర్ల వారీగా ఈ-పంచాయతీ ఆపరేటర్లను నియమించారు. వారికి కంప్యూటర్లు, ప్రింటర్లు కూడా అందించారు. అయితే గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్ సౌకర్యం అందుబాటులోకి రాకపోవడంతో ఈ-పాలన జాడ లేకుండా పోయింది. ఇదిలా ఉండగా చాలా మంది ఈ-పంచాయతీ ఆపరేటర్లు మండల పరిషత్ కార్యాలయాల్లోనే పనిచేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో ప్రజలు పన్నులు, ఇతర రుసుములు చెల్లిస్తున్న వారికి పంచాయతీ కార్యదర్శులు రశీదులను అందజేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం త్వరగా టీ-ఫైబర్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తే గ్రామాల్లోనే డిజిటల్ సేవలు అందుతాయని ప్రజలు కోరుతున్నారు.
సేవలు అందుబాటులోకి వస్తే పనులు సులభతరం: యాదయ్య, డీపీవో
మెదక్ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో టీ-ఫైబర్కు సంబంధించిన పరికరాలు బిగించారు. కరెంటు కనెక్షన్ కూడా ఇచ్చారు. అయితే వాటి నుంచి మాత్రం గ్రామ పంచాయతీలకు ఎలాంటి సేవలు అందడం లేదు. టీ-ఫైబర్ సేవలు అందుబాటులోకి వస్తే పనులు సులభతరం అవుతాయి.