సంగారెడ్డి మార్చి 8 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇటీవల బీజేపీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బీబీపాటిల్ పేరును ప్రకటించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ శుక్రవారం తొలిజాబితాను ప్రకటించింది. అందులో తెలంగాణకు చెందిన నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగానే జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా సురేశ్ షెట్కార్ పేరును అధిష్టానం ప్రకటించింది. నారాయణఖేడ్కు చెందిన సురేశ్షెట్కార్కు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. అయితే నారాయణఖేడ్ ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీపడిన కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల సంజీవరెడ్డి తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టాడు.
ప్రస్తుత మంత్రి దామోదర రాజనర్సింహ ద్వారా కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం సురేశ్షెట్కార్ ఎంపీ టికెట్ ఇస్తామని నచ్చజెప్పి పోటీ నుంచి తప్పుకునేలా చేసింది. సురేశ్ షెట్కార్ తనకు వచ్చిన కాంగ్రెస్ బీఫామ్ను సంజీవరెడ్డికి అప్పగించారు. ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ అధిష్టానం సురేశ్ షెట్కార్కు ఎంపీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ తొలిజాబితాలోనే అయన పేరును ప్రకటించటం గమనార్హం. జహీరాబాద్కు చెందిన ఉజ్వల్రెడ్డి కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం పోటీ పడినా అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వకుండా సురేశ్ షెట్కార్ను ప్రకటించింది. దీంతో ఉజ్వల్రెడ్డి మద్దతుదారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. కామారెడ్డి జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఎంపీ టికెట్ ఆశించారు. వారికి ఎంపీ టికెట్ దక్కకపోవడంతో నిరాశకు గురయ్యారు.