CM KCR | పటాన్చెరు, జూన్ 21: పటాన్చెరు అంటేనే పారిశ్రామికవాడలు గుర్తుకు వస్తాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫార్మా, కెమికల్ పరిశ్రమలున్న చోట అదేస్థాయిలో కాలుష్యం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించకముందు పటాన్చెరు ప్రాంతంలో కాలుష్యం కారణంగా సాధారణ కార్మికులు తప్ప ఎవరూ నివసించేందుకు ఆసక్తి చూపేవారు కాదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రావడంతో కాలుష్య నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నది. దీంతో నూతన పరిశ్రమలన్నీ కాలుష్యరహితంగా ఉంటున్నాయి. దశాబ్దాల కాలుష్యంతో నష్టపోయిన పటాన్చెరు ప్రాంతానికి ఇప్పుడు ఒక్కో సౌకర్యం సమకూరి ప్రజలు ఆనందంతో ఇక్కడ నివసించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. సీఎం కేసీఆర్ రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానకు అనుమతులు ఇవ్వడంతో దశాబ్దాల కాలుష్యంతో నానాకష్టాలు అనుభవించిన ప్రజలకు ఇప్పుడు మెరుగైన వైద్యం అందుబాటులోకి రాబోతున్నది. అన్ని రకాల వైద్యసేవలు ఉచితంగా లభించనున్నాయి. రూ.184 కోట్ల అంచనావ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ సూపర్ స్పెషాలిటీ దవాఖానకు గురువారం సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తున్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రత్యేక కృషితో ఏర్పాటవుతున్న ఈ దవాఖాన శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. కలెక్టర్ శరత్కుమార్ ఆధ్వర్యంలో అధికారులు చకచక సీఎం పర్యటన ఏర్పాట్లు చేస్తున్నారు. అందరి ఆరోగ్యాలకు భరోసా కల్పించే దవాఖానను పటాన్చెరులో ఏర్పాటు చేయడాన్ని అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు.
పటాన్చెరు పట్టణం నడిబొడ్డున ఉన్న రూరల్ హెల్త్ సెంటర్ నాలుగున్నర ఎకరాల స్థలంలో రెండువందల పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను ఏర్పాటు చేస్తున్నారు. రూ.184 కోట్ల 87లక్షల 55వేల అంచనావ్యయంతో దవాఖాన నిర్మాణం కోసం ప్రభుత్వం జీవో 82 జారీ చేసింది. ఈ నిధుల్లో 25శాతం రూ. 46 కోట్ల 21లక్షల 88వేలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. మిగిలిన 75శాతం రూ.138 కోట్ల 65లక్షల 66వేల 287 నిధులను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) భరిస్తున్నది. తీవ్రమైన కాలుష్యంతో దశాబ్దాలుగా పటాన్చెరు ప్రాంత ప్రజలు ఆరోగ్యాలు కోల్పోవడంతో పరిశ్రమపై పీసీబీ విధించిన ఫెనాల్టీలు, ఇతర మార్గాల ద్వారా సమకూరిన ఆదాయాన్ని ఈ దవాఖాన నిర్మాణం కోసం ఖర్చు చేస్తున్నది. నిర్మాణం పనులు, పరికరాలు, ఫర్నిచర్,ల్యాబ్ల సేకరణ వంటి పనులు తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరగనున్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ నియంత్రణలో గ్రౌండ్ ఫ్లోర్తోకలపి మూడు అంతస్తుల్లో 93వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దవాఖాన నిర్మాణం జరగనున్నది.
200 పడకల దవాఖాన ఏర్పాటు కార్మికులకు వరంలా మారుతున్నది. దశాబ్దాల కాలుష్యంతో స్థానికులు తమ ఆరోగ్యాలను పనంగా పెట్టారు. సమైక్యపాలనలో కాలుష్య నియంత్రణ సాధ్యంకాకపోవడంతో పరిశ్రమలు వెదజల్లిన కాలుష్యం ప్రజలకు ఆనారోగ్య సమస్యలను కొనితెచ్చింది. కాలుష్యంతో నానాఅవస్థలు పడుతున్నామని ప్రజలు ఉద్యమించారు. కొందరు పర్యావరణవేత్తలు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కి కాలుష్య విముక్తి కోసం విన్నవించారు. సుప్రీంకోర్టు పటాన్చెరు ప్రాంత ప్రజల కాలుష్య కష్టాలను విని పలు దశల్లో ప్రజలకు ఉపయోగపడే తీర్పులు ఇచ్చింది. ఉచిత నీరు అందజేయడం, పాతనీటి బకాలయి మాఫీ చేయడం, పరిశ్రమలపై ఫెనాల్టీలు విధించడం, పలు రకాల నిబంధనలతో పరిశ్రమల కాలుష్యం కట్టడిచేయడం, జీరో డిస్చార్జ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. పటాన్చెరు నుంచి కాలుష్య కేసులు పెరిగిపోతుండటంతో చెన్నైలో గ్రీన్ ట్రిబ్యునల్ను పర్యావరణ కేసులను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. గ్రీన్ ట్రిబ్యునల్ పటాన్చెరు పరిశ్రమల కాలుష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు పరిశ్రమలను క్లోజ్ చేసేందుకు పీసీబీకి డైరెక్షన్లు ఇచ్చింది. గ్రీన్ ట్రిబ్యునల్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత కాలుష్యంపై దిద్దుబాటు చర్యలు తీసుకోవడం గమనించి పటాన్చెరులో పీసీబీ వద్ద ఉన్న నిధులతో దవాఖాన ఏర్పాటు చేయాలని సూచించింది. తక్షణమే స్పందించిన తెలంగాణ సర్కార్ పటాన్చెరు ప్రాంత ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను ఏర్పాటు చేసేందుకు చర్యలకు దిగింది.
జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, కార్డియాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, సిటీ సర్జరీ, డెర్మటాలజీ, పల్మనాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, పీడీయాట్రిక్ విభాగాల్లో సేవలు అందజేస్తారు. వాటితోపాటు అందుబాటులో పలు వార్డులు ఉంటాయి. ఎన్ఐసీయూ వార్డ్, డయాలసిస్ వార్డ్, కార్డియాక్ వార్డ్, ఎంఐసీయూ వార్డ్, న్యూరో వార్డ్, కార్డియాక్ ఐసీయూ వార్డ్, ఎన్ఎస్ఐసీయూ వార్డ్, గైనకాలజీ వార్డ్, సర్జరీ వార్డ్, జనరల్ మెడిసిన్ వార్డ్లు ఏర్పాటు చేస్తున్నారు. వైద్య సేవలతోపాటు ల్యాబ్ సేవలు ప్రజలు అందుబాటులో ఉంటాయి. మైక్రో బయాలజీ ల్యాబ్, బయో కెమిస్ట్రీ ల్యాబ్, పథాలజీ ల్యాబ్, బ్లడ్ బ్యాంక్, క్యాత్ ల్యాబ్లు నిత్యం 24గంటలు సేవలందిస్తాయి.
పటాన్చెరులో పెద్ద దవాఖాన ఏర్పాటు చేయడం నా చిరకాల స్వప్నం. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఏకంగా 200 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన మంజూరు కావడం ఆనందంగా ఉంది. మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ అండతో ఈ దవాఖానకు అనుమతులు సాధించాం. రూ. 184కోట్లతో పాటు అదనంగా మరిన్ని నిధులు కూడా రాబోతున్నాయి. అనుమతులు ఇచ్చిన సీఎం కేసీఆర్కు ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉం టాం. దవాఖాన కోసం కృషి చేసిన సీఎం కేసీఆర్కు, మంత్రులకు, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు. మా ప్రాంత ప్రజల ఆరోగ్యాలకు సీఎం భరోసా ఇవ్వడం మాకు గర్వంగా ఉంది.
– గూడెం మహిపాల్రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే