కొల్చారం/వెల్దుర్తి/చిలిపిచెడ్, నవంబర్ 16: సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, చావునోట్లోకి పోయి తెలంగాణ సాధించిన కేసీఆర్ ఔర్ ఏక్ ధక్కా.. హ్యాట్రిక్ సీఎం కావడం తథ్యమని కొల్చారం జడ్పీటీసీ మేఘమాల ధీమా వ్యక్తం చేశారు.
నర్సాపూర్లో గురువారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో కొల్చారం మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
నర్సాపూర్లో ఎమ్మెల్యే మదన్రెడ్డి ఆశీర్వాదంతో సునీతారెడ్డి భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని, ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా భారీ స్పందన వస్తుందన్నారు. తొమ్మిదిన్నర ఏండ్లల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని మేఘమాల ధీమా వ్యక్తం చేశారు.