కొల్చారం, మార్చి 23: మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని చిన్న ఘనపూర్ శివారులో మంజీరా నదిపై ఉన్న వనదుర్గా ప్రాజెక్టు ఆనకట్ట ఎత్తు పెంపు పనులు చేపట్టాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సోమవారం అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయన్నారు. ప్రారంభించిన పనులు, ప్రభుత్వం మారడంతో మధ్యలోనే నిలిచిపోయాయన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేండ్లలో తట్టెడు మట్టి ఎత్తలేదన్నారు. ఇప్పుడు సింగూరు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, అందులో భాగంగానే ఘనపూర్ ఆనకట్ట నిర్మాణ పనులు కూడా ప్రారంభించాలని సంబంధిత మంత్రిని ఎమ్మెల్యే కోరారు. ఘనపూర్ ఆనకట్ట నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ను పిలిచి వెంటనే పనులు ప్రా రంభించేలా చర్యలు తీసుకుంటే సింగూరు పనులు పూర్తయ్యేలోపు ఘనపూర్ ఆనకట్ట పనులు కూడా పూర్తవుతాయన్నారు. గతంలో ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపుతో ముంపునకు గురయ్యే భూములను తక్కువగా చూపించారని, మళ్లీ సర్వే చేసి వాస్తవంగా ముంపునకు గురయ్యే భూములు గుర్తించాలన్నారు.
నర్సాపూర్, ఆందోలు నియోజక వర్గాల్లోని రైతుల భూములు ఘనపూర్ ప్రాజెక్టుతో ముంపునకు గురవుతున్నాయన్నారు. ఆందోలు నియోజక వర్గంలోని ముంపు బాధితులకు పరిహారం చెల్లించారని, నర్సాపూర్ నియోజకవర్గంలోని ముంపు బాధితులకు ఇంకా పెడింగ్లో ఉన్నదని, వెంటనే చెల్లించాని డిమాండ్ చేశారు. నష్టపరిహారం కింద ఇచ్చే నగదు మొత్తాన్ని కూడా పెంచాలని కోరారు. సింగూరు పరీవాహక పరిధిలో రెండేండ్లు క్రాప్ హాలిడే ప్రకటించారని, అక్కడ అందరూ సన్న, చిన్నకారు రైతులే ఉన్నందున వారికి వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.