నిజాంపేట, డిసెంబర్ 1: వ్యవసాయంలో యాంత్రీకరణ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. ఆధునిక యంత్రాలు వస్తుండడంతో రైతులు ధీమాగా సాగుచేస్తున్నారు. కూలీల కొరత నుంచి యంత్రాలతో బయటపడుతున్నారు. మండలంలో ఇటీవల చెరుకు సాగు పెరిగింది. నీటి వనరులు అందుబాటులో ఉన్న రైతులు వార్షిక పంటైన చెరుకును సాగు చేస్తున్నారు. నాడు చెరుకును అందుబాటులో ఉన్న చక్కెర పరిశ్రమలకు తరలించే వారు. ఈ ప్రక్రియ కష్టతరంగా ఉండేది. శాస్త్రీయ పరిజ్ఞానం పెరిగిన కొద్ది రైతులు యంత్రాల సాయంతో వ్యవసాయం చేస్తున్నారు.
సరైన సమయంలో చెరుకు కోత ప్రక్రియ జరగకుంటే రైతుకు నష్టం జరుగుతుంది. ఇలాంటి సమయంలో రైతులకు వరంగా చెరుకు కోత యంత్రం అందుబాటులోకి వచ్చింది. ఈ యంత్రం రోజుకు 10 ఎకరాల మేర చెరుకు పంటను కోస్తుంది. చెరుకు పంటను కోసేందుకు కూలీలకు టన్నుకు రూ.1000 చెల్లించగా, చెరుకు కోత యంత్రం టన్నుకు కేవలం రూ.610 చెల్లిస్తే సరిపోతుంది. తక్కువ డబ్బు, తక్కువ సమయంలో ఎక్కువగా పనిచేస్తున్న చెరుకు కోత యంత్రం వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. నిజాంపేటతో పాటు రజాక్పల్లి, కల్వకుంట, జడ్చెరువు తండా, బచ్చురాజ్పల్లి తదితర గ్రామాల్లో 35 ఎకరాల్లో రైతులు చెరుకు సాగుచేశారు.నిజాంపేట మండలం రజాక్పల్లి గ్రామానికి చెందిన పరశురాములు తన చేనులో 6 ఎకరాల్లో చెరుకు సాగుచేశాడు. ప్రస్తుతం చెరుకు పంట ఏపుగా పెరిగి కోత దశకు చేరుకుంది. కూలీల కొరత ఉన్న ఈ సమయంలో కొంత మంది రైతులు చెరుకు కోత యంత్రాన్ని ఆశ్రయిస్తున్నారు.మొదటగా ఈ యంత్రం చెరుకు గడలను ముక్కలుగా చేసి లిఫ్టింగ్ ట్రాక్టర్లోకి వేస్తుంది. ఆ తర్వాత ట్రాక్టర్లు చెరుకు గడలను లారీల్లో నింపి ఫ్యాక్టరీకి తరలిస్తారు. చెరుకు గడలు ముక్కలు చేయడంతో అధిక బరువుతో పాటు చక్కెర శాతం అధికంగా ఉంటుంది.యంత్రంతో చెరుకు పంటను కోసిన అనంతరం మిగిలిన చెరుకు వ్యర్థ పదార్థాలు భూమి అడుగు భాగాన పడి కుళ్లిపోయి ఎరువుగా మారుతుంది.తర్వాత పంట ఏపుగా పెరగడానికి ఈ ఎరువు ఉపయోగపడుతుంది.
డబ్బు, సమయం ఆదా..
నాకున్న వ్యవసాయ భూమిలో 6ఎకరాల్లో మూడేండ్లుగా చెరుకు సాగు చేస్తున్నా.వర్షాలు బాగా కురవడంతో పంట ఏపుగా పెరిగింది. పంట కోసే సమయం వచ్చే సరికి కూలీల కొరత ఏర్పడంది.ప్రతిసారి లేబర్తోనే కొట్టిస్తాను.కానీ, వారు అధికంగా డబ్బులు అడుగుతున్నారు.ఈ సమస్యను అధిగమించడానికి నిజాంపేటలో ఉన్న చెరుకు యంత్రాన్ని ఆశ్రయించా.చెరుకు కోత యంత్రంతో తక్కువ సమయం,తక్కువ ఖర్చుతో చెరుకు పంట కోశా..దీంతో సమయం,డబ్బు ఆదా అయ్యాయి.రైతుల సంక్షేమమే
– పరశురాములు, రైతు, రజాక్పల్లి (మెదక్ జిల్లా)
రైతులు ఇతర పంటల సాగుచేయాలి..
రైతులు తప్పకుండా పంట మార్పిడి పాటించాలి. తద్వారా భూసారం పెరిగి అధిక దిగుబడి సాధ్యమవుతుంది.ఏడాది పాటు సాగుచేస్తున్న చెరుకు పంటను కోసేందుకు అందుబాటులోకి వచ్చిన కోత యంత్రం రైతుల పాలిట వరంగా మారింది. పత్తి, చెరుకు వంటి వార్షిక పంటలను సాగుచేయడంతో రైతులు ఆర్థికాభివృది సాధ్యం. రైతులు చెరుకు కోత యంత్రం పట్టే విధంగా తమ భూముల్లో చెరుకును నాటుకొని వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి. ఏపుగా పెరిగిన చెరుకు నేలకొరగకుండా తగిన సమయంలో కట్టలుగా కడితే పంట మొత్తం నిటారుగా ఉంటుంది.దీనివల్ల కోత సమయంలో చెరుకు గడలు వృథాగా నేలపై పడిపోవు.
– సతీశ్,మండల వ్యవసాయ అధికారి, నిజాంపేట (మెదక్ జిల్లా)