న్యాల్కల్, ఏప్రిల్ 7: మండలంలోని రాఘవాపూర్-హుమ్నాపూర్ గ్రామాల శివారులోని సిద్ధ సరస్వతీ పంచవటీ క్షేత్రంలో గరుడగంగా పూర్ణ మంజీరా కుంభమేళాకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రలోని బాలాఘాట్ పర్వతాల్లో పుట్టి మహారాష్ట్ర, కర్ణాటక గుండా గౌడ్గావ్ వద్ద తెలంగాణలో ప్రవేశించిన మంజీరా నదికి దక్షిణ భారత దేశంలోనే మొదటిసారిగా 2010లో పంచవటీ క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా ఆధ్వర్యంలో కుంభమేళా నిర్వహించారు. ఆ తర్వాత 2013, 2018లో కుంభమేళా జరిగింది. ఈ నెల 24వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు నాలుగో సారి మళ్లీ కుంభమేళా నిర్వహించనున్నారు.
ఈ మేళాకు హాజరవుతున్న నాగసాధువులు, సాధుసంతులు, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్, కాశీనాథ్ బాబా ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 12 రోజుల పాటు జరిగే కుంభమేళాకు ఉత్తర భారతదేశం నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు. వారికోసం అన్నదానం చేసేందుకు ప్రత్యేక షెడ్లు సిద్ధం చేశారు. మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముళ్లపొదలు, చెత్తాచెదారాన్ని తొలిగిస్తున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు, బట్టలు మార్చుకునే షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. రోడ్లకు మరమ్మతులు చేసేందుకు సంబంధిత శాఖాధికారులు పరిశీలించారు. నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్ శాఖ చర్యలు తీసుకుంటున్నది. భక్తులకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ గ్రిడ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాశీనాథ్ బాబాతో మాట్లాడి ఏఏ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలో అడిగి అక్కడ ప్రత్యేక నల్లాలు బిగించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రఘువీర్ తెలిపారు.