హత్నూర, ఏప్రిల్ 4: మండలంలోని చందాపూర్ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో పేలుడు శబ్దానికి సమీపంలోని బోర్పట్ల ప్రభుత్వ పాఠశాల కిటికీలు, తలుపు విరిగిపడ్డాయి. బుధవారం సాయంత్రం కావడంతో పాఠశాలలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. పేలుడు శబ్దానికి పాఠశాల భవనం గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి.
దీంతో గురువారం విద్యార్థులు భయంగుప్పిట్లో పాఠశాలకు వచ్చి తరగతి గదిలో కాకుండా చెట్లకింద కూర్చున్నారు. పలువురు విద్యార్థులు పాఠశాలకు రావడానికి భయపడుతున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. పరిశ్రమ సమీపంలోని పలు స్టీల్ పరిశ్రమల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు పరిశ్రమల ప్రతినిధులు తెలిపారు. పరిశ్రమల పైకప్పులతో పాటు అడ్డుగా అమర్చిన సిమెంటు రేకులు పూర్తిగా ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు.