పదికి పది పాయింట్లు సాధించడమే లక్ష్యం
పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు
ప్రతి రోజూ ప్రత్యేక తరగతులు
ఈ నెల 23 నుంచి పరీక్షలు
విద్యార్థుల సందేహాల నివృత్తికి ‘డయల్ యువర్ టీచర్’
జిల్లాలో ‘పది’ పరీక్షలకు 14,923మంది విద్యార్థులు
విద్యార్థుల జీవితంలో పదో తరగతి కీలకమైనది. ఈ నెల 23వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలను నిర్వహించేందుకు జిల్లా విద్యా శాఖ సర్వం సిద్ధం చేసింది. ఈ సారి ‘పది’ ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచేలా కసరత్తు చేస్తున్నది. నూరు శాతం ఫలితాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. రెండేండ్ల తర్వాత పరీక్షలు జరుగుతుండగా, అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసింది. విద్యార్థుల సందేహాల నివృత్తికి ‘డయల్ యువర్ టీచర్’ కార్యక్రమం ప్రారంభించింది.
గజ్వేల్ రూరల్, మే 16: ఈసారి పదోతరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచేలా ఉపాధ్యాయులు విద్యార్థులను అన్ని విధాలుగా సిద్ధం చేస్తూ పదిలో నూరుశాతం ఫలితాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వేసవిలో కూడా ఉదయం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను అన్ని సబ్జెక్టుల్లో రాణించేలా సన్నద్ధం చేస్తున్నారు. రెండేండ్లుగా కరోనాతో వార్షిక పరీక్షల నిర్వహణ చేపట్టకపోవడంతో ఈ యేడు విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్న తరుణంలో ప్రభుత్వం కూడా 11 పేపర్ల ఉన్న పరీక్షలను ఆరు పేపర్లకు కుదించింది. దీంతో విద్యార్థులపై ఎలాంటి భారం పడకుండా చేసింది. జిల్లా పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ప్రభుత్వ, ప్రైవేట్ కలుపుకొని 438 ఉండగా అందులో 14,923 మంది విద్యార్థులు పదోతరగతి చదువుతున్నారు.
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధజిల్లాలోని అన్ని పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని ఉపాధ్యాయులు నివృత్తి చేసి ఎప్పటికప్పుడు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 228 ఉండగా అందులో 7569 మంది, 22 కేజీబీవీల్లో 714 మంది, 14 ఆదర్శ పాఠశాలల్లో 1367 మంది, 31 గురుకులాల్లో 2123 మంది, 143 ప్రైవేట్ పాఠశాలల్లో 3150 మంది ఉన్నారు. మొత్తం 438 పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు 14,923 మంది ఉండగా వీరంతా ఈ నెల 23 నుంచి జరిగే వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకు పరీక్ష నిర్వహించి మిగతా 20 మార్కులను ఎఫ్ఏలో వచ్చిన వాటిని కలుపుతారు.
ఆరు పేపర్లకు కుదింపు
గతంలో ఆరు సబ్జెక్టులకు 11 పేపర్లుగా పరీక్షను ఎస్ఎస్సీ బోర్డు నిర్వహించేది. కానీ కరోనా కారణంగా విద్యా సంవత్సరం సెప్టెంబర్లో ప్రారంభం కావడంతో విద్యార్థులపై భారం పడకూడదనే ఉద్దేశంతో 11 పేపర్లను ఆరు పేపర్లకు కుదించింది. అయితే గతంలో ప్రతి రోజూ పరీక్ష సమయం 2.45 గంటలు మాత్రమే ఇవ్వగా ఈ నెల 23 నుంచి జరిగే పరీక్షలకు మాత్రం మరో అరగంట అదనంగా ఇచ్చారు. దీంతో విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి కలుగదు. సమయం అదనంగా ఉండడంతో పరీక్ష రాసుకునే వెసులుబాటు ఉంటుంది.