మనూరు, ఫిబ్రవరి 23: బాసర ట్రిపుల్ ఐటీలో డోవూరుకు చెందిన విద్యార్థిని మృతిచెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మనూ రు మండల పరిధిలోని డోవూర్ గ్రామానికి చెందిన తెనుగు నర్సింలు, రుక్మిణి దంపతుల కూతురు శిరీష (17) బాసర ట్రిపుల్ ఐటీ మొదటి సంవత్సరం చదువుతున్నది. అయితే, కొన్ని రోజులుగా సొంత గ్రామంలోనే ఉంటున్న శిరీషను గురువారం తండ్రి నర్సింలు బాసర కళాశాలలో దింపి వచ్చాడు.
తిరిగి ఇంటికి చేరుకుని రాత్రి సమయంలో ఫోన్లో మాట్లాడినప్పుడు క్షేమంగానే ఉన్నట్లు చెప్పిందని కుటుంబీకులు తెలిపారు. కాగా, రాత్రి సుమారు 11గంటల సమయంలో శిరీష హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నదని బాసర కళాశాల నుంచి తమకు సమాచారం ఇచ్చారన్నారు. తల్లిదండ్రులకు క్షమాపణ చెబుతూ లెటర్ రాసి పెట్టి గదిలో ఉరి వేసుకున్నదని తెలిపారు. ఉన్నత చదువులు చదువుకుని తల్లిదండ్రులు, గ్రామానికి మంచి పేరు తెస్తుందని అనుకుంటే.. తిరిగిరాని లోకాలకు చేరుకున్నదని బంధుమిత్రులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శిరీష మృతదేహం గ్రామానికి చేరుకోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.