సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 22: విధి నిర్వహణలో అలసత్వం వహించద్దని, ప్రతి అధికారి నిజాయితీగా పనిచేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. గురువారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో గజ్వేల్ డివిజన్ పోలీస్ అధికారులతో పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. సైబర్ నేరాలు జరగకుండా ప్రజలకు, యువకులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
మార్చి 9న జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు డిస్పోజలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన కేసులను త్వరగా పూర్తి చేసి, చార్జ్షీట్ వేయాలని సూచించారు. పీడీఎస్ రైస్, ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టి, నేరాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి, ఏసీపీ బాలాజీ, సీఐలు, ఎస్ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.