మెదక్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో చేపడుతున్న ఏర్పాట్లపై రాష్ర్ట ఎన్నికల పరిశీలకుడు అజయ్ వి.నాయక్ ఆరా తీశారు. శుక్రవారం జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లపై రాష్ర్ట జనరల్ అబ్జర్వర్ అజయ్ వి.నాయక్, రాష్ట్ర పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా వారికి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణిప్రియదర్శిని, జిల్లా సాధారణ పరిశీలకుడు పృథ్వీరాజ్ బీపీ, పోలీసు పరిశీలకుడు సంతోశ్కుమార్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్ల గురించి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా రాష్ట్ర పరిశీలకులకు పవర్ పాయింట్ ద్వారా వివరించారు. జిల్లాలోని రెండు నియోజకవర్గంలో 24 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని, మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల గురించి జిల్లాకు కేటాయించబడిన సాధారణ పరిశీలకుడు పృథ్వీరాజ్ను ఆరా తీయగా, ఇప్పటి వరకు రెండు నియోజకవర్గాల పరిధిలోనూ పరిస్థితులన్నీ సజావుగానే ఉన్నాయని వివరించారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని స్టేట్ అబ్జర్వర్లు పోలీస్ కమిషనర్కు సూచించారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎలక్షన్ కమిషన్ పాసులు ఉన్న వారిని మినహాయించి, ఇతరులు ఎవరినీ లోనికి అనుమతించకూడదని, ఈ విషయమై క్షేత్ర స్థాయిలో బందోబస్తు విధులు నిర్వర్తించే సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించరాదని, పోలింగ్ స్టేషన్ల సమీపంలో ఓటర్లను అభ్యర్థులు, వారి ఏజెంట్లు కలిసి వారికే ఓటు వేసేలా ఒత్తిడి చేయకుండా కట్టుదిట్టమైన నిఘా ఉంచాలన్నారు. ఎన్నికల బందోబస్తు సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శించకూడదని, అలాగని నిబంధనల ఉల్లంఘనకు పాల్పడే వారిని ఏమాత్రం ఉపేక్షించకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓటింగ్ సందర్భంగా ఏవైనా పోలింగ్ కేంద్రాల వద్ద అనుకోని రీతిలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటే సమాచారం అందిన వెంటనే హుటాహుటిన అకడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించాలని తెలిపారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లు, మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు అంబదాస్ రాజేశ్వర్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
మెదక్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు ఎన్నికల సాధారణ పరిశీలకుడు పృథ్వీరాజ్ తెలిపారు. శుక్రవారం ఎన్నికల సాధారణ పరిశీలకుడు పృథ్వీరాజ్ సమక్షంలో మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజెషన్ ప్రక్రియను నిర్వహించి, పూర్తి చేశారు. ఈ సందర్భంగా సాధారణ పరిశీలకుడు పృథ్వీరాజ్ ర్యాండమైజేషన్ను నిశితంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మెదక్(34), నర్సాపూర్(37) అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించామన్నారు. విడతల వారీగా ఎంపిక చేసిన వివిధ కేంద్రాల్లో మాస్టర్ ట్రైనర్స్తో పోలింగ్ నిర్వహణపై శిక్షణా తరగతులు నిర్వహించినట్లు కలెక్టర్ రాజర్షి షా, పరిశీలకుడు పృథ్వీరాజ్ దృష్టికి తీసుకొచ్చారు. పోలింగ్ కేంద్రాలకు కేటాయించబడిన ప్రతి బృం దంలో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక సహాయ ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు ఇతర పోలింగ్ సిబ్బంది ఉంటారన్నారు. రెండు నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ నిర్వహణ కోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాల చొప్పున మహిళా బృందాలు, ఒక దివ్యాంగుల, యువతతో కూడిన పోలింగ్ బృందాలు ఎంపిక చేసినట్లు వివరించారు. సమావేశంలో జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారులు, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్, రిటర్నింగ్ అధికారులు అంబదాస్ రాజేశ్వర్, శ్రీనివాసులు, ఈడీఎం సందీప్కుమార్, పరిశ్రమల శాఖ అధికారి కృష్ణమూర్తి, మ్యాన్ పవర్ నోడల్ అధికారి రాజేశ్వర్రెడ్డి, మైన్స్ ఏడీ జయరాజ్, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.