మెదక్/జహీరాబాద్/అందోల్, ఫిబ్రవరి 4 : మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో గంజాయి సాగు, రవాణాపై పోలీసు, ఎక్సైజ్ శాఖ కఠినంగా వ్యవహరిస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో దూకుడు పెం చింది. గంజాయి రహిత జిల్లాయే లక్ష్యంగా ముం దుకు సాగుతున్నది. ఇందు కోసం క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నది.
గంజాయి, సారా వినియోగం తయారీని మొ గ్గలోనే తుంచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి అందే అన్ని రకాల సబ్సిడీలు సైతం నిలిపివేయాలని సూచించింది. ఇందులో భాగంగా గంజాయి కట్టడికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. డ్రగ్స్ ఫ్రీ గ్రామాలకు ప్రత్యేక నిధులు, ప్రోత్సాహకాలు అందిస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో వాటిని అందిపుచ్చుకునేందుకు పాలకులు, అధికారులు ఎలాంటి చర్య లు తీసుకుంటారనే విషయమై జిల్లాలో చర్చ జరుగుతోంది. మరో వైపు నిషేధిత మత్తు పదార్థాల దందా నిర్వహిస్తున్న వ్యక్తులపై పీడీ యాక్ట్, క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా జిల్లా యంత్రాంగం వెనుకాడడం లేదని తెలుస్తోంది.
ఇప్పటి వరకు ప్రైవేట్ వాహనాల్లో ఎక్కువగా గంజాయి రవాణా చేసేవారు. ప్రైవేట్ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తుండడంతో ముఠాలు రూటు మార్చాయి. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేశారు. జిల్లాలో గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులను పట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో మెదక్ జిల్లా పాపన్నపేట మండలం అన్నారం గ్రామంలో ఎండు గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. గంజాయికి బానిసలవుతున్న వారిలో యువతే ఎక్కువ. గంజాయి వినియోగిస్తూ మొదటిసారి దొరికితే వారికి ఒక అవకాశం ఇస్తూ కౌన్సెలింగ్ ఇచ్చి పంపుతున్నారు. రెండోసారి దొరికితే కేసు పెడుతున్నారు.
గంజాయి అంతర పంటగా సాగు కాకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. కొన్ని చోట్ల సాగు చేసిన మొక్కలను ధ్వంసం చేశారు. కొందరు స్మగ్లర్లు రైతుల పొలాలను కౌలుకు తీసుకుని వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని అంతర పంటలుగా వేస్తుండడంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆరు నెలల వ్యవధిలో జహీరాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా పదుల సంఖ్యలో గంజాయి కేసులు నమోదు కాగా, లక్షల విలువ చేసే పంటను అధికారులు ధ్వంసం చేశారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని గ్రామాల్లో పలు చేలల్లో దాడులు చేశారు.
స్మగ్లర్లు సరుకు నిల్వకు జహీరాబాద్ ప్రాం తాన్ని కేంద్రంగా చేసుకుంటున్నట్లు నిఘావర్గాల తెలియగా, 65వ జాతీయ రహదారిపై గట్టి నిఘా పెట్టారు. కొందరు స్మగ్లర్లు ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో కొనుగోలు చేసిన గంజాయిని జహీరాబాద్ ప్రాంతంలోని సరిహద్దు గ్రామాల్లో నిల్వ ఉంచుతున్నట్లు సమాచారం. ఆంధ్రాలోని రంపచోడవ రం, సీలేరు అటవీ ప్రాంతాల్లో నిల్వ చేసే గంజాయిని జహీరాబాద్ ప్రాంతానికి చెందిన వారు తీసుకవస్తున్నారనే ఆరోపణలున్నాయి. సమాచారం అందిన వెంటనే అధికారులు రంగంలోకి దిగి, చర్యలు చేపడుతున్నారు. మహారాష్ట్రకు చెందిన గంజాయి స్మగ్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నా రు. జహీరాబాద్ నుంచి రాష్ట్ర సరిహద్దు సుమారు 20కిలో మీటర్లు ఉండగా, ఈ ప్రాంతంలో పోలీ సు వాహనాలు తనిఖీ చేస్తున్నాయి. గతంలో గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడటానికి కారణాలు తెలుసుకొని, కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారని నిఘా వర్గాల సమాచారం.
సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో మెదక్ జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నాం. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రజల్లో చైతన్యం కలిగిస్తాం. పోలీసు, ఎక్సైజ్, అటవీ, వ్యవసాయ, ఇతర శాఖల సమన్వయంతో ముందుకువెళ్తాం. గ్రామ, మండల, డివిజన్ ఇలా అన్ని స్థాయిల్లో కమిటీలు వేస్తాం.
– రోహిణి ప్రియదర్శిని, మెదక్ ఎస్పీ
మెదక్ జిల్లాలో గంజాయిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తాం. గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులతో పాటు వారికి సహకరిస్తున్న వారిపై నిఘా ఉంచుతాం. గంజాయి సాగు నిర్మూలన కోసం అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకెళ్తాం. ఇప్పటికే జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నాం.
– ఎంఏ రజాక్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్, మెదక్
గంజాయి సాగు.. రవా ణా.. నిల్వ నేరం.. అలాం టి వారిపై ఎన్డీపీఎస్ చ ట్టం ప్రకారం చర్యలు తీ సుకుంటాం. జోగిపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో గట్టి నిఘా పెట్టాం. గ్రామాల్లో కొన్నిచోట్ల అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఎక్కడైనా గంజాయి సాగు చేస్తే ప్రజలు సమాచారం ఇచ్చి, సహకరించాలి.
– సుబ్రహ్మణ్యం, ఎక్సైజ్ సీఐ, జోగిపేట