పేదోడి గుండెకు సీఎం కేసీఆర్ భరోసా కల్పిస్తున్నారు. గుండెపోటు వచ్చిందంటే ప్రథమ చికిత్సకు సైతం కార్పొరేట్ దవాఖానల్లో లక్ష రూపాయల వరకు ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు చొరవతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రధాన దవాఖానల్లో స్టెమీ ప్రోగ్రాం ద్వారా సేవలందిస్తున్నారు. గుండె పోటుతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి చికిత్స చేస్తూ ప్రాణాలను రక్షిస్తు న్నారు. ఈసీజీ ద్వారా గుండెపోటు తీవ్రతను పరిశీలిస్తారు. గజ్వేల్, సిద్దిపేట ప్రభుత్వ జిల్లా దవాఖా నల్లో ఈ స్టెమీ ప్రోగ్రాం కొనసాగుతున్నది. కేవలం గజ్వేల్ దవాఖానలోనే ఏడాదిలో 5వేల మంది గుండెపోటు బాధితులు ఈ సేవలు పొందారు.
గజ్వేల్, జనవరి 5: పేదవారి గుండెకు రక్షణగా వైద్య సేవలందిస్తూ సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. గుండెపోటు వచ్చిందంటే కార్పొరేట్ దవాఖానల్లో ప్రథమ చికిత్సకు రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన ప్రభుత్వ దవాఖానల్లో స్టెమీ ప్రోగ్రామ్తో సేవలందిస్తూ గుండెపోటుతో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సమయానికి చికిత్స అందిస్తూ వారి ప్రాణాలు రక్షిస్తున్నారు.
కొనసాగుతున్న స్టెమీ ప్రోగ్రామ్
జిల్లాలో గజ్వేల్, సిద్దిపేట ప్రభుత్వ జిల్లా దవాఖానలో ఈ స్టెమీ ప్రోగ్రామ్ కొనసాగుతున్నది. గుండెపోటుతో బాధపడే 5 వేల మంది గజ్వేల్ దవాఖానలో వైద్య సేవలు పొందుతున్నారు. అత్యవసర విభాగం విధుల్లో ఉన్న డాక్టర్ను సంప్రదించగానే గుండెపోటుతో బాధపడే వారికి ఈసీజీ తీస్తున్నారు. ట్రైకాగ్ సంస్థ సహకారంతో ఆన్లైన్ అనుసంధానమైన ఈసీజీ యంత్రం నుంచి బెంగళూర్, హైదరాబాద్ నిమ్స్ దవాఖానల్లోని ఏడుగురు గుండె వైద్య నిపుణులతో పాటు దవాఖానలోని సూపర్ వైజర్, విధుల్లోని డాక్టర్, టెక్నీషియన్ ద్వారా రిపోర్టు వస్తుంది. ఒకవేళ వ్యక్తి పరిస్థితి ప్రమాదకరంగా ఉంటే టెక్నీషియన్ ఫోన్కు అలారం వస్తుంది. దీంతో ఆ వ్యక్తికి టెనెక్టివ్ ప్లస్ ఇంజక్షన్ ఇచ్చి హైదరాబాద్లోని నిమ్స్కు కానీ ప్రత్యేక సౌకర్యాలు గల దవాఖానకు గానీ తరలిస్తారు. అతి తీవ్రమైన గుండెపోటు వచ్చిన వ్యక్తికి టెనెక్టివ్ ప్లస్ ఇంజక్షన్ ఇవ్వడంతో మరో 24 గంటల పాటు ప్రాణాపాయం నుంచి రక్షణ పొందుతాడు. ఈ సమయంలోనే నిమ్స్ లేదా వారికి నచ్చిన దవాఖానకు చేరుకుని వైద్యం పొందే అవకాశం ఉంటుంది.
టెనెక్టివ్ ప్లస్ ఇంజక్షన్కు రూ.50 వేలు
టెనెక్టివ్ ప్లస్ ఇంజక్షన్ ఇవ్వడానికి కార్పొరేట్ దవాఖానల్లో రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు చార్జి వేస్తారు. కార్పొరేట్ దవాఖానల్లో ప్రథమ చికిత్స సమయంలో అన్ని సేవలు కలిపి కనీసం రూ.లక్ష చార్జి చేశారు. స్టెమీ ప్రోగ్రాం గజ్వేల్, సిద్దిపేట ప్రభుత్వ జిల్లా దవాఖానల్లో అమలవుతున్నట్లుగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ప్రజలకు ఉచితంగా సేవలు లభిస్తున్నాయి.
ప్రభుత్వ వైద్యం పటిష్టంగా మారింది
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు సారథ్యంలో ప్రభుత్వ వైద్య రంగం పటిష్టమైంది. ప్రజలకు తలనొప్పి మొదలుకొని గుండె నొప్పి, ఆపరేషన్లు, ప్రసవాలకు కూడా పూర్తి ఉచిత వైద్య సేవలందుతున్నాయి. గతంలో ప్రభుత్వ దవాఖానలకు ఉన్న చెడ్డ పేరును మంత్రి హరీశ్రావు వైద్యశాఖను చేపట్టాక పూర్తిగా మారిపోయేలా చేశారు. పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం ప్రభుత్వ దవాఖానల్లో అందుతున్నది. దీంతో దవాఖానల్లో వైద్య పరీక్షలు చేయించుకునేవారి సంఖ్య భారీగా పెరిగింది. ప్రభుత్వ వైద్యమే మేలు అనేలా ప్రభుత్వ దవాఖానలు సేవలందిస్తున్నాయి. రాష్ట్ర వైద్య రంగాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ధన్యవాదాలు. – డాక్టర్ యాదవరెడ్డి, ఎమ్మెల్సీ
పైసా ఖర్చు లేకుండా ప్రథమచికిత్స
కార్పొరేట్ దవాఖానల్లో వేలు, లక్షలు ఖర్చు చేస్తే గానీ దొరకని వైద్యసేవలు ప్రభుత్వ దవాఖానల్లో పూర్తి ఉచితంగా అందిస్తున్నాం. ముఖ్యంగా గుండెపోటు వచ్చినా, అనుమానంగా ఉన్నా ప్రభుత్వ దవాఖానలోని అత్యవసర విభాగంలో సంప్రదించిన వారికి ఈసీజీ పరీక్షలు నిర్వహిస్తాం. వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉంటే వెంటనే టెనెక్టివ్ ప్లస్ ఇంజక్షన్ ఇచ్చి నిమ్స్కు తరలిస్తాం. మరో 24 గంటల పాటు ప్రాణాపాయం ఉండదు. – డాక్టర్ మాధవాచారి, వైద్యుడు
కృతజ్ఞతలు చెబుతున్నారు
స్టెమీ ప్రోగ్రాంను చాలా మంది వినియోగించుకుంటున్నారు. ఏటా 5వేల మంది వరకు ఈ సేవలు పొందుతున్నారు. ఇక్కడ టెనెక్టివ్ ప్లస్ ఇంజక్షన్ తీసుకువెళ్లి హైదరాబాద్లో వైద్యం పొంది, తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెబుతున్నారు. దీంతో సంతోషంగా ఉంటుంది.
– మంతూరు రాజు, టెక్నీషియన్