గజ్వేల్ రూరల్, డిసెంబర్19: రాష్ట్ర ప్రభుత్వం కులమతాలకతీతంగా ప్రతి పండుగను అధికారికంగా జరిపిస్తున్నదని, అందరూ సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం పట్టణంలోని క్రిస్టియన్ భవనంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా బట్టలు పంపిణీ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ప్రతి పండుగను ఘనంగా జరిపిస్తున్న సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ను అందరూ దీవించాలన్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది జరుపుకొనే పండుగ క్రిస్మస్ అని అన్నారు.
ముస్లింలకు రంజాన్, హిందువులకు దసరా, క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభు త్వం కానుకలు అందజేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ పేదల కోసం పని చేసే గొప్ప నాయకుడన్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారి నా ఎవరికి కూడా భవనాలు నిర్మించలేదన్నారు. సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర ప్రభు త్వాన్ని కోరినా విస్మరించిందని, నేడు సీఎం కేసీఆర్ రాష్ట్ర పండుగగా జరిపిస్తున్నారన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా కేక్ కట్ చేశారు.
నియోజకవర్గంలో నాలుగు వేల కుటుంబాలకు బట్టలు పంపిణీ చేశారు. అనంతరం 40 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ దేవేందర్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, డీఆర్డీఏ పీడీ గోపాల్రావు, ఆర్డీవో విజయేందర్రెడ్డి, గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్రెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవీరవీందర్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, పాస్టర్లు మణిక్రావు, బాపురెడ్డి పాల్గొన్నారు.