మెదక్ అర్బన్, జనవరి 23 : రోడ్డు భద్రతా మార్గదర్శకాలకనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవిగుప్తా జిల్లా పోలీస్ అధికారులకు సూచించారు. మంగళవారం అన్ని జిల్లాల పోలీస్ అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వీసీలో ఎస్పీ డాక్టర్ బాలస్వామితో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ రవిగుప్తా మాట్లాడుతూ అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగిన పోలీస్ స్టేషన్లను గుర్తించి కారణాలు, తక్షణ నివారణ చర్యలు, ఆయా ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, చెట్లపొదల తొలిగింపు, రేడియం స్టిక్కర్లు, బ్లింకర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.