ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరుకావాలని, లేదంటే చర్యలు తప్పవని మెదక్ కలెక్టర్ హరీశ్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి నిర్ణయాధికారాలు లేని కిందిస్థాయి అధికారులను మీటింగ్కు ఎట్టి పరిస్థితుల్లో పంపొద్దని ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, వివరాలను వెబ్సైట్లో నమోదు చేయాలని సూచించారు. మొత్తం 44 విజ్ఞప్తులు అందాయని తెలిపారు. సంగారెడ్డి ప్రజావాణిలో 55 అర్జీలు వచ్చినట్లు అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి తెలిపారు.
మెదక్ మున్సిన్సిపాలిటీ, మే 23: పదో తరగతి వార్షిక పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. సోమవారం జిల్లా వ్యాప్తంగా 72పరీక్ష కేంద్రాల్లో తొలి రోజు ప్రథమ భాష పరీక్షకు 11,393 విద్యార్థులకు గాను 11,261 మంది విద్యార్థులు హాజరు కాగా 132మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్ తెలిపారు. తొలి రోజు పరీక్షలకు విద్యార్థులు తల్లిదండ్రులతో, వారివారి బంధువులతో పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకున్నారు. జిల్లా కేంద్రం, పాపన్నపేటలోని పరీక్షా కేంద్రాలను డీఈవో సందర్శించారు. ప్లయింగ్ స్కాడ్స్ అల్లాదుర్గం, రేగోడ్, రామాయంపేట, నిజాంపేట, కొల్చా రం మండలాలలోని 18 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలో ఎక్కడ డిబార్కు కానీ, మాల్ప్రాక్టిస్కు పాల్పడలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా 98.84శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించడంతో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్లలోపు జిరాక్స్ కేంద్రాలను మూసివేశారు.
ప్రశాంతంగా పది పరీక్షలు
సంగారెడ్డి కలెక్టరేట్, మే 23: పదో తరగతి పరీక్షల్లో భాగంగా మొదటి రోజు 99.07శాతం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 22,555మంది విద్యార్థులకు గాను 22,346మంది విద్యార్థులు హాజరయ్యారు. 209 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా అదనపు కలెక్ట ర్లు వీరారెడ్డి, రాజర్షీ షా, జిల్లా విద్యాశాఖ అధికారి ఆయా పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డి సంగారెడ్డిలోని కరుణా హైస్కూల్లోని ఏ, బీ కేంద్రాలను పరిశీలించగా, రాజర్షీ షా కొండాపూర్లోని జిల్లా పరిషత్ హైస్కూల్ను తనిఖీ చేశారు. అదే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేశ్ సంగారెడ్డి, నందికంది, సదాశివపేటలో పర్యటించి 10 పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు. ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు మరో 34కేంద్రాలను తనిఖీ చేయగా, మొత్తం 47పరీక్షా కేంద్రాలను మొదటి రోజు అధికారులు పరిశీలించారు. పరీక్షల నిర్వహణను పరిశీలించడంతో పాటు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే అంశంపై ఆరా తీశారు.
పకడ్భందీ ఏర్పాట్లు
జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అధికారులు పకడ్భందీ ఏర్పాట్లు చేశారు. మొత్తం 117పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఉదయం 9:30నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష జరిగింది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ విధించారు. ఆయా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకోవడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. విద్యార్థుల సౌకర్యం కోసం అన్ని రూట్లలో ఆర్టీ సీ బస్సులను నడిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు సం బంధించి ఏదైనా సమాచారం, సందేహాల నివృత్తి కోసం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. ఎలాంటి సందేహాలు ఉన్నా 9381190 475ను సంప్రదించవచ్చని డీఈవో వెల్లడించారు.
ఆరోగ్యం సహకరించకున్నా పరీక్షకు
రామాయంపేట, మే 23 : ఆ విద్యార్థికి అపెండె క్సు ఆపరేషన్ చెయించుకున్న రెండు రోజులకే సోమవారం ప్రారంభమైన పదో తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యాడు. ఝాన్సీలింగపూర్ గ్రామానికి చెంది న సంపత్కుమార్కు రెండు రోజుల క్రితం రామాయంపేటలోనే ఓ ప్రైవేటు దవాఖానలో అపెండెక్సు ఆపరేషన్ అయింది. అయినా పరీక్షలను రాయాలనే తపనతో రామాయంపేటలోని వివేకానంద పాఠశాలలో పరీక్షా కేంద్రానికి చేరుకుని పరీక్షలు రాస్తున్నాడు. సంపత్కుమార్కు తోటి స్నేహితులు సైతం సహకరిస్తున్నారు.