చిలిపిచెడ్, జనవరి 11: మంజీరానది తీరాన కొలువుదీరిన చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి ఎంతో విశిష్టత ఉన్నది. నది జలసవ్వడులు., పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణం, నిత్యం దూపదీప నైవేద్యాలు, కుంకుమార్చనలు, ఒడిబియ్యం, ప్రత్యేక పర్వదినాలలో విశిష్టమైన పూజా కార్యక్రమాలతో ఈ ఆలయం వెల్లివిరుస్తున్నది. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చిట్కుల్ శివారులోని మంజీరా నది తీరాన భక్తులకు దర్శనమిస్తున్న చాముండేశ్వరి అమ్మవారి గుడి భారత దేశంలోని రెండో అతిపెద్ద ఆలయం. 1979లో అమ్మవారి భక్తుడు కుళాచార్య బ్రహ్మశ్రీ వెంకటరమణయ్య ఇక్కడ స్థలాన్ని శుద్థి చేసి ఆలయ నిర్మాణానికి పునాది వేశారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి నుంచి ఉత్తమ శిలలను తెప్పించి తమిళ శిల్ప కళాకారులతో 9 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని చెక్కించినారు.
పద్దెనిమిది చేతులతో జ్వాలా కిరీటంతో వెలుగొందుతున్న అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ, కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కల్పవృక్షంగా విరాజిల్లుతున్నది. సాధారణంగా దేవాలయం పూర్తిగా నిర్మించిన తర్వాత విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. కానీ ఇక్కడ ఒక తిన్నెపై ప్రతిష్టించగా, ఆలయం వసతులు, ఇతర సౌకర్యాలతో ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతున్నది. అమ్మవారిని నిండుమనసుతో తలచుకొని మంజీరా నదిలో మునిగి తడిబట్టలతో శక్తి కొలది ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగఢ నమ్మకం. పశ్చిమాభిముఖంగా ఉన్న అమ్మవారికి ఎదురుగా బ్రాహ్మి, వైష్ణవి, కాళీ దేవతలు కొలవు దీరారు. గర్భగుడిలో అమ్మవారికి ఒక వైపు మహిషాసురుడు, ఇంకొకవైపు సింహం ముఖాకృతిలో విగ్రహాలు ప్రతిష్టించారు. ఆలయంలో ప్రతి శుక్రవారం ఉదయం 5 గంటలకు దేవతలకు అభిషేకాలు నిర్వహిస్తారు. ఏటా నవరాత్రులు ప్రారంభం రోజు, వార్షికోత్సవాల్లో మొదటిరోజు ఆలయ వేదపండితుల ఆధ్వర్యంలో మంజీరా నదిలో నుంచి భక్తులు కొత్త కుండలో మాత్రమే తీసుకువచ్చే నీటితో అమ్మవారికి జలాభిషేకం చేస్తారు. సంవత్సరంలో ఈ రెండు రోజుల్లోనూ వచ్చిన భక్తులందరికీ ఈ అభిషేకంలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తారు.
చాముండేశ్వరి అమ్మవారి ఆలయ 40వ వార్షికోత్సవాలు గురువారం నుంచి శనివారం వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి అమ్మవారికి సంపూర్ణ మహాజలాభిషేకంతో వార్షికోత్సావాలు ప్రారంభమవుతాయి. మూడు రోజుల పాటు ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు జపాలు, పారాయణాలు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు మహాపూజ, మహానివేదన, హారతి, తీర్థప్రసాద వితరణ ఉంటుందని చాముండేశ్వరి సేవా సమితి, శక్తి మండల సభ్యులు, ప్రధాన పూజారి ప్రభాకర్శర్మ తెలిపారు.