సమ్మక్క-సారలమ్మ జాతరకు మెదక్ రీజియన్ నుంచి 200 బస్సులు
హుస్నాబాద్ జాతరకు తిరుగనున్న 35 బస్సులు
30మంది ఉంటే ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు
సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీలోనే ప్రయాణించాలి : అధికారులు
కార్గో ద్వారా మొక్కులు : ఆర్టీసీ
సంగారెడ్డి, ఫిబ్రవరి 11: పండుగేదైనా, జాతరేదైనా క్షేమంగా చేర్చడమే లక్ష్యంగా ఆర్టీసీ ప్రయాణికులకు సేవలందిస్తున్నది. ఈనెల 16 నుంచి 19 వరకు జరిగే మేడారం సమ్మక-సారలమ్మ జాతరకు ఆర్టీసీ మెదక్ రీజియన్ నుంచి 200 బస్సులు, హుస్నాబాద్ డిపో నుంచి మరో 35 బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో 8 ఆర్టీసీ డిపోల నుంచి దూర ప్రాంతాలకు బస్సులు నడుపుతూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. పండుగలు, జాతరలు, ముఖ్య సందర్భాల్లో ఏటా ఆర్టీసీ అధికారులు మెదక్ రీజియన్ నుంచి తెలంగాణతో పాటు ఆంధ్రా రాష్ర్టానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.
మెదక్ నుంచి వరంగల్ రీజియన్కు…
మెదక్ ఆర్టీసీ రీజియన్లోని 8 డిపోల నుంచి 200 బస్సులను వరంగల్ రీజియన్కు జాతర స్పెషల్గా బస్సులను ఆర్టీసీ అధికారులు కేటాయించారు. వరంగల్-2 డిపోకు 15 బస్సులు, హనుమకొండకు 97 బస్సులు, పరకాలకు 16 బస్సులు, నర్సంపేటకు 22 బస్సులు, తొర్రూర్కు 30 బస్సులు, భూపాలపల్లి డిపోకు 20 బస్సులను మెదక్ రీజియన్ నుంచి కేటాయించారు. ఈనెల 13వ తేదీన 25 బస్సులు, 14న 135 బస్సులు, 15న 40 బస్సులను ఆయా పట్టణాలకు పంపించే ఏర్పాట్లు చేశారు. అలాగే, హుస్నాబాద్ డిపో నుంచి 35 బస్సులు మేడారం జాతరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. జాతరకు 6 రోజుల పాటు ప్రత్యేక బస్సులు నడిపిస్తారు.
30 మంది ఉంటే ఇంటి వద్దకే బస్సు…
మేడారం జాతరకు వెళ్లేందుకు 30 మంది ప్రయాణికులు ఉంటే, తమ ఇంటి వద్ద కే ఆర్టీసీ బస్సు పంపించే విధంగా అధికారులు చర్య లు తీసుకుంటున్నారు. అలాంటి వారు ముందుగా దగ్గరలోని ఆర్టీసీ డిపో మేనేజర్ను సంప్రదించి, పూర్తి సమాచారం ఇస్తే భక్తులు వెళ్లే రోజు బస్సు సిద్ధ్దం చేస్తారు. ఒకే కుటుంబానికి చెందిన భక్తులు అందరూ కలిసి ప్రయాణించేందుకు వీలుగా ఆర్టీసీ సేవలు అందిస్తున్నారు. దీనికోసం ఇంటి వద్దకే బస్సును పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.
జాతరకు ప్రత్యేక బస్సులు
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు మెదక్ రీజియన్ నుంచి వరంగల్ రీజియన్కు 200 బస్సులు కేటాయించాం. ఈనెల 13నుంచి కేటాయించిన బస్సులను మూడు విడతలుగా పంపిస్తాం. జాతరకు వెళ్లే ప్రయాణికులను క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యం పెట్టుకున్నాం. ఏటా మెదక్ రీజియన్ నుంచి పండుగలు, ప్రముఖ జాతరలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం కన్నా ఆర్టీసీ ప్రయాణమే సురక్షితం. క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ ప్రయాణం చేసి కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉండాలని ఆర్టీసీ ఆకాంక్ష.
– సుదర్శన్, ఆర్టీసీ మెదక్ రీజినల్ మేనేజర్ (సంగారెడ్డి)