సంగారెడ్డి, డిసెంబర్ 15 : పుట్టుకతో ఎవరూ నేరస్తులు కారని, పరిస్థితులను బట్టి క్షణికావేశంలో నేరాలు చేస్తారని ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. శుక్రవారం పోలీస్ కల్యాణ మండపంలో రౌడీమేళా కార్యక్రమంలో భాగంగా సత్ప్రవర్తన కలిగి ఉండాలని రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రత పరిరక్షణకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. చట్టానికి లోబడి ఉన్నవారితో ఫ్రెండ్లీగా ఉంటామని, చట్టాన్ని అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
సంఘవిద్రోహ చర్యలకు పాల్పడిన, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టిన చర్యలు తప్పవన్నారు. సత్ప్రవర్తనతో కలిగి ఉన్న రౌడీషీటర్లపై హిస్టరీ షీట్లను తొలగిస్తామన్నారు. జిల్లా ప్రజలు సంఘవిద్రోహ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ అశోక్, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ డీఎస్పీలు రమేశ్కుమార్, వెంకట్రెడ్డి, రఘు, ఎస్బీ ఇన్స్పెక్టర్ శివలింగం, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.