జిన్నారం, జూలై 16: ప్రతి కేసు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పోలీసులకు సూచించారు. గురువారం సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని సర్కిల్ కార్యాలయంతో పాటు, పోలీస్స్టేషన్ను ఆయన సందర్శించారు. జిన్నారం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. పీఎస్ ఆవరణలో పరిశుభ్రత, సిబ్బంది బ్యారక్స్, రికార్డుల నిర్వహణను ఎస్పీ పరిశీలించారు. స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు జరిపి బాధితులకు అండగా ఉండాలని సూచించారు.
కేసుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. కిట్ ఆర్టికల్స్ను జాగ్రత్తగా వినియోగించుకోవాలని సిబ్బందికి సూచించారు. రౌడీ షీటర్లు, సస్పెన్స్ హిస్టరీ షీటర్ల వివరాలు పరిశీలిస్తూ వారి కదలికలపై నిఘా పెట్టాలన్నారు. నేరాల నియంత్రణ, నేరాల ఛేదనలో సీసీ కెమెరాల పాత్రను ప్రజలకు వివరించాలన్నారు. స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. యువ కానిస్టేబుళ్లు అన్ని రకాల విధులు నిర్వహిస్తూ పూర్తి స్థాయి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. జిన్నారం సర్కిల్ కార్యాలయం, పోలీస్స్టేషన్ నిర్వహణ, రికార్డులపై ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్, జిన్నారం సీఐ రమణారెడ్డి, ఎస్సై హన్మంతు, సిబ్బంది పాల్గొన్నారు.