మెదక్, ఫిబ్రవరి 10(నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లా పరిధిలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. మంగళవారం మెదక్ టౌన్ కేంద్రంలోని వేస్లీ కాలేజీ ప్రాంగణంలో మున్సిపల్ ఎన్నికల బందోబస్తు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బందికి ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో క్రమశిక్షణగా విధులు నిర్వహించాలని సూచించారు.
ఉదయం ప్రారంభం నుంచే ప్రతి పోలీసు సిబ్బంది తమ డ్యూటీ పోస్టులకు హాజరై, ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి, వారికి అవసరమైన సహకారం అందించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల చుట్టుపక్కల 100 మీటర్ల పరిధిలో గుంపులు గుమికూడడం పూర్తిగా నిషేధమని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా చర్యలు గమనించిన వెంటనే స్పందించి, పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు బలగాలు, స్ట్రైకింగ్ ఫోర్సులు, వీడియో రికార్డింగ్ ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.
పోలింగ్ స్టేషన్ ప్రాంతంలో ప్రచార సామగ్రి, పార్టీ చిహ్నాలు, మొబైల్ ఫోన్లు తీసుకురావడం నిషేధమని స్పష్టం చేశారు. పోలింగ్ బూత్లో సెల్ఫీలు దిగడంపై పూర్తిస్థాయి నిషేధం ఉంటుందని తెలిపారు. ఎన్నికల సమయంలో మద్యం, డబ్బుల పంపిణీ, ఓటర్లపై ఒత్తిడి, తప్పుడు ప్రచారాలు నిర్వహించిన వారిపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఏదైనా అనుమానాస్పద చర్యలు గమనించినట్లయితే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి జిల్లా ప్రజలు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.