మెదక్ : మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిల్లపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన దొంగతనం ఘటనకు సంబంధించిన కేసు పురోగతిపై జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలతో ఎస్పీ సమీక్ష నిర్వహించి, ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, అనుమానితుల వివరాలు, సాంకేతిక విశ్లేషణపై చర్చించారు. నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు.
సీసీటీవీ ఫుటేజ్, సెల్ఫోన్ డేటా, పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, జిల్లాలోని చెక్పోస్టులు,అవుట్పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. ప్రజల్లో భద్రతాభావం పెంపొందించేలా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, గ్రామాల్లో రాత్రి పహారా మరింత బలోపేతం చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సీఐలు రాజశేఖర్ రెడ్డి, జాన్ రెడ్డి, జార్జ్, రేణుక రెడ్డి, సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి, ఎస్ఐలు బాలరాజ్, శివానందం, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.