Mahabubnagar | సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ) : విశాఖపట్నం-కాచిగూడ-విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైలును మహబూబ్నగర్ వరకు పొడిగిస్తూ గురువారం దక్షిణ మధ్య రైల్వే జోనల్ అధికారులు తెలిపారు. ఈ నెల 20 నుంచి మహబూబ్నగర్ ప్రాంతానికి చెందిన ప్రయాణికులకు కూడా ఈ ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులో ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు ఎస్సీఆర్ వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
21న 17 రైళ్లు రద్దు
ఘట్కేసర్-చర్లపల్లి రైల్వేస్టేషన్ల మధ్య కొనసాగుతున్న రైల్వే కోచ్ టెర్మినల్ పనుల వల్ల పలు రైళ్లు రాకపోకలకు ఆటంకం కలుగనున్నది. అందుకోసం సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే ఆధ్వర్యంలో దాదాపు 17 రైళ్లను రద్దు చేసినట్లు గురువారం రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఈ రైళ్లు ఈ నెల 21న (ఆదివారం) రద్దు కానున్నాయన్నారు. వరంగల్ -సికింద్రాబాద్, హైదరాబాద్-కాజీపేట్, కాచిగూడ-మిర్యాలగూడ, నడికుడి – మిర్యాలగూడ, గుంటూరు-వికారాబాద్, హైదరాబాద్-సిర్పూర్కాగజ్నగర్, సికింద్రాబాద్-గుంటూరు, సికింద్రాబాద్-సిర్పూర్కాగజ్నగర్ వంటి పలు స్టేషన్ల మధ్య రైళ్లు రద్దు ఉంటుందన్నారు. అలాగే ఐదు రైళ్ల సమయాలను రీషెడ్యూల్ చేశామన్నారు.