సంగారెడ్డి, మార్చి 20: జిల్లాలో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సరిహద్దుల్లో ప్రత్యేకంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచుతామని ఐజీ సుధీర్బాబు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆయన సందర్శించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణ, పోలీసు పరేడ్ గ్రౌండ్, మోటార్ వెహికిల్ సెక్షన్, నూతనంగా ప్రారంభించిన పోలీసు క్యాంటీన్, వాటర్ ప్లాంట్లను ఎస్పీ చెన్నూరి రూపేశ్తో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో ఐజీ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బు, మద్యం అక్రమ రవాణా జరుగకుండా అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లాల సరిహద్దు చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు.
ప్రతి చెక్పోస్ట్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లా కేంద్రం నుంచి పర్యవేక్షణకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేయాలని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టద్దొని సూచించారు. అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పోలీసు అధికారులతో ఐజీ సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని, ప్రజలకు ఏదైనా సమస్య వస్తే త్వరితగతిన స్పందించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది ఎవరూ హెడ్ క్వార్టర్స్ను వదిలి వెళ్లొద్దని, 24/7అందుబాటులో ఉండాలని ఐజీ సుధీర్బాబు ఆదేశించారు.