పుల్కల్, మార్చి 5: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు నుంచి ఐదో విడతలో భాగంగా మంగళవా రం మెదక్ జిల్లా ఘనపూర్ ఆయకట్టుకు నీటి పారుదల శాఖ అధికారులు సింగూరు జలాలను విడుదల చేశారు.
ప్రాజెక్టు సమీపంలోని జలవిద్యుత్ కేంద్రం నుంచి 1460 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామని జేఈఈ మహిపాల్ రెడ్డి తెలిపారు. మత్స్యకారులు, గొర్రెల కాపరులు నది పరీవాహక ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 20.668 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.