సింగూరు ప్రాజెక్టు కింద ఆయకట్టు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నది. యాసంగి సీజన్లో సాగునీటికి ఇబ్బంది రాకుండా కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని విడుదల చేయడంతో రైతన్నలు సంబురంగా సాగు చేసుకుంటున్నారు. ఎడమ కాల్వ కింద పుల్కల్, చౌటకూరు మండలాల పరిధిలో 22 వేల ఎకరాలు, అందోల్ మండలంలో 13వేల ఎకరాలు, కుడి కాల్వ కింద మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లిలో 127 ఎకరాలకు ప్రభుత్వం నీటిని అందిస్తున్నది. సింగూరు జలాలతో 166 చెరువులను నింపుతుండడంతో అదనంగా మరో 10వేల ఎకరాలకు నీరందుతున్నది. గతంలో సరైన నీటి సౌకర్యం లేక కేవలం ఆరుతడి పంటలు వేసుకున్న రైతులు, ప్రస్తుతం నీటి లభ్యత పెరగడంతో వరి, చెరకు పండిస్తున్నారు. తాజాగా, రాష్ట్ర బడ్జెట్లో కాలువల ఆధునీకరణ, మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.22.86 కోట్లు కేటాయించగా, త్వరలో పనులు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
సంగారెడ్డి, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : మూడు దశాబ్దాల రైతుల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. సింగూరు జలాలు జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర పాలనలో సింగూరు జలాల కోసం ఎన్ని పోరాటాలు చేసినా ఫలితం దక్కలేదు. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాల కోసం వినియోగించారే తప్ప పంటలకు నీరివ్వలేదు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ పాలనా పగ్గాలు చేపట్టాక సింగూరు ప్రాజెక్టు నుంచి సాగునీరు ఇవ్వడం ప్రారంభమైంది. సింగూరు ఎడమ, కుడి కాల్వల పనులు పూర్తిచేసి 40వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు దిగువన ఉన్న 166 చెరువులను సింగూరు జలాలతో నింపి అదనంగా 10,000 ఎకరాలకు నీటిని అందిస్తున్నారు. గతంలో యాసంగి సీజన్లో పుల్కల్, చౌటకూరు, అందోలు మండలాల్లోని రైతులు ఆరుతడి పంటలు సాగు చేసేవారు. కానీ, ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందిస్తుండటంతో వరి, చెరుకు పంటలు పండిస్తున్నారు. ఇటీవల అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సింగూరు కాల్వల ద్వారా యాసంగి సీజన్ కోసం సాగునీటిని విడుదల చేశారు. దీంతో కాల్వల ద్వారా 40వేల ఎకరాలు, చెరువుల కింద అదనంగా మరో 10వేల ఎకరాల్లో పంటలను సాగుచేయనున్నారు. ప్రస్తుత బడ్జెట్లో సింగూరు ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.22.86 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో కాల్వ లైనింగ్, ఆధునీకరణ పనులు త్వరలోనే చేపట్టనున్నారు.
35వేల ఎకరాలకు సాగునీరు
సింగూరు ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా యాసంగి సీజన్లో 40వేల ఎకరాలకు సాగునీరు సరఫరా చేస్తున్నారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందకపోవడంతో 35వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. దీంతో, సింగూరు ఆయకట్టు వరి, చెరుకు పంటలతో కళకళలాడుతున్నది. ప్రధాన కుడికాల్వ 12.5 కిలోమీటర్లు, ఎడమ కాల్వ 24 కిలోమీటర్లు ఉంది. ఎడమ కాల్వ కింద పుల్కల్, చౌటకూరు మండలాల్లో 24,057 ఎకరాలకు సాగునీరు అందజేయాల్సి ఉండగా, సింగూరు, పుల్కల్, పోచారం, ముద్దాయిపేట, బస్వాపూర్, మిన్పూర్, కోడూరు, ముదిమాణిక్యం, లక్ష్మీసాగర్, పోసానిపల్లి, సరాఫ్పల్లి, సాయిబాన్పేట, గొంగ్లూరు, సుల్తాన్పూర్, తాడ్దాన్పల్లి తదితర గ్రామాల్లోని 22వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఆయా గ్రామాల్లోని రైతులు ప్రస్తుతం వరి, చెరుకు పంటలను సాగు చేస్తున్నారు. అలాగే, అందోల్ మండలంలోని పోతిరెడ్డిపల్లి, సంగుపేట, అల్మాయిపేట, అందోలు, డాకూరు, అక్సాన్పల్లి, జోగిపేట తదితర గ్రామాల్లో 13వేల ఎకరాల్లో వరి, చెరుకు తదితర పంటలు పండిస్తున్నారు. ఈ మూడు మండలాల్లో 166 చెరువులను సింగూరు జలాలతో నింపుతున్నారు. దీంతో అదనంగా మరో 10వేల ఎకరాలకు నీరందనున్నది. ఇక, సింగూరు కుడి కాల్వ ద్వారా మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లి గ్రామంలోని 127 ఎకరాలకు నీటిని సరఫరా చేస్తున్నారు.
యాసంగిలో 45వేల ఎకరాలకు సాగునీరు
సింగూరులో పుష్కలంగా జలాలు ఉన్నాయి. ప్రస్తుత యాసంగి సీజన్లో ఎడమ, కుడికాల్వల ద్వారా 35వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. పుల్కల్, అందోల్, చౌటకూరు, మునిపల్లిలోని రైతులు వరి, చెరుకు పంటలు వేశారు. కాల్వల ద్వారా 166 చెరువులను నింపి అదనంగా పదివేల ఎకరాలకు సాగునీరు సరఫరా చేస్తున్నాం. సింగూరు ప్రాజెక్టు కాల్వల ద్వారా సాగునీరు అందిస్తుండటంతో రైతులు సంతోషంగా ఉన్నారు. కాల్వల ఆధునీకరణ పనులను త్వరలో ప్రారంభిస్తాం.
– మధుసూదన్రెడ్డి, ఇరిగేషన్ ఈఈ
కాల్వ నీటితో వరి సాగు చేశా
యాసంగి సీజన్లో సింగూరు ప్రాజెక్టు ద్వారా సాగునీటిని ఇస్తారని ఊహించలేదు. ప్రభుత్వం కాల్వల ద్వారా పొలాలకు నీరివ్వడం సంతోషంగా ఉంది. పుల్కల్లో నాకు 1.50 ఎకరాల భూమి ఉంది. సింగూరు నీరు వస్తుండడంతో వానకాలం సీజన్లో వరివేశా. ఇప్పుడు యాసంగిలో కూడా సాగునీరు ఇస్తుండటంతో ఇప్పుడు వరి సాగు చేస్తున్నాను. మాకు సాగునీటి కష్టాలు తప్పినయి. నీళ్లిస్తున్న బీఆర్ఎస్ సర్కారుకు ధన్యవాదాలు.
– డి.ఆంజనేయులు, రైతు, పుల్కల్
పొలాలు సస్యశ్యామలం
యాసంగి సీజన్లో సింగూరు ఎడమ కాల్వ ద్వారా పొలాలకు నీరివ్వడం సంతోషంగా ఉంది. కోడూరులో నాకు రెండెకరాల పొలం ఉంది. నా భూమి పక్కనే సింగూరు కాల్వ ఉంది. దీంతో బోరు ద్వారా నీటిని తోడటం పూర్తిగా మానేశా. ప్రస్తుతం కాల్వ నీటితోనే రెండు ఎకరాల్లో వరి సాగు చేశా. సాగునీరు పుష్కలంగా అందుతుండడంతో మంచి పంటలు పండి లాభాలు వస్తాయన్న నమ్మకం ఉంది.
– ఎస్.రాములు, రైతు, కోడూరు