జహీరాబాద్, జనవరి 14 : ‘మన పంటలను మనం కాపాడుకోవాలి, అంతరించిపోతున్న విత్తనాలను నిల్వ చేసి వర్షాధారంగా సాగు చేయాలి.’ అని డీడీఎస్ డైరెక్టర్ వి. రుక్మిణీరావు అన్నారు. ఆదివారం జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండలంలోని జాడిమల్కాపూర్ గ్రామంలో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ మహిళా సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత పంటల జాతరను రుక్మిణీరావు జ్యోతి వెలిగించి ప్రారంభించి, చిరుధాన్యాలు సాగు చేసిన మహిళా రైతులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాత పంటల జాతరను 24 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామన్నారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చిరుధాన్యాలకు గుర్తింపు తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశామన్నారు. పాత పంటలను కాపాడేందుకు ప్రతి ఒకరు ప్రయత్నించాలని, చిరుధాన్యాలకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. జీవవైవిధ్య పంటల్లో మంచి పోషకాలున్నాయని, ప్రతి ఒక్కరూ ఈ పంటలను సాగు చేయాలని సూచించారు. అధికారులు ప్రోత్సహించకపోయినా, రైతులంతా పాత పంటలు పండించాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు సలోమి, మనిమయ్ సిన్హా, కంచన్ మాలిక్, అపర్ణ, వాసుకీ బేలవాడి, వినోద్ పావురాలతో పాటు ప్రజాప్రతినిధులు,అధికారులు, మహిళా రైతులు పాల్గొన్నారు.