ములుగు, డిసెంబర్ 7: మండలపరిధిలోని వంటిమామిడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జహంగీర్, పాలకవర్గ సభ్యులు తమ పదవులకు గురువారం రాజీనామా సమర్పించారు. ఇటీవల వెలువడిన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుకూలమైన స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోకపోవడంతో ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఎంసీ చైర్మన్ జహంగీర్, మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు సైతం తమ రాజీనామా పత్రాలను అధికారులకు అందజేశారు. 2014లో కేసీఆర్ వంటిమామిడి మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా ఉద్యమనేత, కేసీఆర్ బాల్యమిత్రుడైన మహ్మద్ జహంగీర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జహంగీర్ కోరిక మేరకు 2021లో అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా మార్కెట్ను సందర్శించి మార్కెట్ అభివృద్ధి, రైతులకు మద్దతు ధర లభించేందుకు అవసరమైన ప్రణాళికలను అధికారులతో కలిసి రూపొందించారు. మార్కెట్ను వెజిటబుల్ హబ్గా రూపొందించేందుకు, కూరగాయల నిల్వలకు కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు రూ.100కోట్లు మంజూ రు చేశారు. మార్కెట్ విస్తరణకు 75 ఎకరాలు సేకరించగా విస్తరణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఏఎంసీ డైరెక్టర్లు ఏనుగు బాపురెడ్డి, రాందాస్గౌడ్, నిమ్మకాయల గణేశ్, తిరుపతి నాయక్, బాలయ్య ఉన్నారు.
అధికారంలో లేకున్నా సేవలందిస్తాం
అధికారులకు తన రాజీనామా పత్రాన్ని అందిజేసిన తర్వాత ఏఎంసీ చైర్మన్ జహంగీర్ మాట్లాడారు. మార్కెట్ కమిటీ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రస్థాయిలో సముచిత మార్పులు చేశామన్నారు. రైతులకు మద్దతు ధర వచ్చేలా, కమీషన్ ఏజెంట్లు అతితక్కువ కమీషన్ మాత్రమే వసూలు చేసేలా అవసరమైన చర్యలు చేపట్టామని తెలిపారు. వ్యాపారస్తులు, అధికారుల సహకారంతో రైతులకు ఎన్నో సేవలు అందించామని, అధికారంలో లేకపోయినా రైతులకు అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు.