కోరికలు తీర్చే కోరమీసాల కొమురవెల్లి మల్లన్న స్వామి కల్యాణానికి ఆలయ పాలకవర్గం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. ఆదివారం కల్యాణం అంగరంగ వైభవంగా జరగనున్నది. కల్యాణోత్సవానికి 30వేల మందికి పైగా భక్తులు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణోత్సవానికి దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీచైర్మన్లు హాజరుకానున్నారు. స్వామివారి క్షేత్రంలోని సీసీరోడ్లను శుభ్రం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం బారికేడ్లు ఏర్పాటు చేశారు. తోటబావి వద్ద నిర్మించిన శాశ్వత కల్యాణ వేదిక, ఆలయ సుందరీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఉత్సవాల ఏర్పాట్లపై సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
చేర్యాల, జనవరి 5 : తెలంగాణ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 7న జరిగే మల్లన్న కల్యాణోత్సవానికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు హాజరుకానున్నారు.స్వామి వారి క్షేత్రంలోని సీసీ రోడ్లను శుభ్రం చేయడంతో పాటు, ట్రాఫిక్ నియంత్రణ కోసం బారికేడ్లు ఏర్పాటు చేశారు. తోటబావి వద్ద నిర్మించిన శాశ్వత కల్యాణ వేదిక, ఆలయ సుందరీకరణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల ఏర్పాట్ల పై కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నిత్యం పర్యవేక్షిస్తున్నారు స్వామి వారి కల్యాణోత్సవానికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు.
స్వామి వారి కల్యాణోత్సవానికి 30 వేల మంది భక్తులు హాజరయే అవకాశం ఉన్నందున మల్లన్న ఆలయ అధికారులతో పాటు ప్రభుత్వశాఖ అధికారులు వారికి వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.కల్యాణ వేదిక తోటబావి ప్రాంతంలో నిర్మించిన శాశ్వత కల్యాణ వేదిక వద్ద బారికేడ్లు, షామియానులు, పచ్చదనం ఉట్టిపడే విధంగా పలు ఏర్పాట్లు చేస్తున్నారు.ఆలయానికి వచ్చిన భక్తులు దేవుని సన్నిధిలో సేదతీరేందుకు గంగరేగుచెట్టు, కల్యాణ వేదిక, ప్రసాదాల విక్రయశాల వద్ద చలువు పందిళ్లు తదితర వసతులు ఏర్పాటు చేశారు.స్వామి వారి కల్యాణోత్సవంతో పాటు బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు మిషన్ భగీరథపధకంలో భాగంగా సరఫరా అవుతున్న గోదావరి నీటిని నల్లాల ద్వారా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్వామి వారి క్షేత్రంలో (గోదావరి జలాలు) తాగు నీటిగా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి తోడు ఆలయవర్గాలకు చెందిన 18 బోర్లు, 15 నీటి ట్యాంకులు, 300 కుళాయిలు సిద్ధం చేశారు.
స్వామి వారి క్షేత్రంలో 3 సులబ్ కాంప్లెక్స్లు, బస్ స్టేషన్ వద్ద తాత్కాలిక టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు.దీంతో పాటు భక్తుల స్నానాల కోసం 200 షవర్స్ ఏర్పాటు చేశారు. వీటితో పాటు షవర్స్ పక్కనే మహిళలు బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.పస్తుతం ఉన్న ఆర్టీసీ బస్సులు కాకుండా సిద్దిపేట, జనగామ జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేకంగా బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.రాజీవ్ రహదారిలోని మల్లన్న స్వాగత తోరణాల వద్ద అన్ని ఆర్టీసీ డిపోల బస్సులు నిలుపాలని ఆలయవర్గాలు ఆర్టీసీ ఉన్నతాధికారులకు ప్రత్యేకంగా లేఖలను పంపించారు. స్వామి వారి క్షేత్రానికి వచ్చే భక్తుల వాహనాలను నిలిపేందుకు ఇబ్బందులు తలెత్తకుండా మూడు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవ వేద పర్యవేక్షణకు మధ్యప్రదేశ్ ఉజ్జయని పీఠాధిపతి సిద్ధ లింగరాజ దేశికేంద్ర శివాచార్య మహాస్వామీజీ మల్లన్న క్షేత్రానికి రానున్నారు. స్వామిజీ ఈ నెల 6వ తేదీన రాత్రి పొద్దుపోయిన తర్వాత కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి చేరుకొనున్నారు.ఆదివారం వేకువజామున ఆలయవర్గాలు నిర్వహించే దృష్టికుంభాల కార్యక్రమంలో స్వామీజీ పాల్గొనడంతో పాటు శ్రీ మల్లికార్జున స్వామి వారి తొలి దర్శనాన్ని చేసుకోనున్నారు.అనంతరం ఉదయం 10.45 గంటలకు ప్రారంభమై కల్యాణోత్సవాన్ని పర్యవేక్షించనున్నారు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.స్వామి వారి కల్యాణోత్సవానికి 30వేలకు పైగా భక్తులు హాజరుకానున్నారు.స్వామి వారి కల్యాణోత్సవం కాగానే భక్తులు అక్షింతలు వేసి స్వామి వారిని దర్శించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ కల్యాణోత్సవానికి హాజరుకానున్నారు. స్వామి వారి కల్యాణోత్సవానికి అన్నివర్గాలకు చెందిన భక్తులు హాజరుకావాలి.