సిద్దిపేట, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి 21 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నేడు(బుధవారం) హైదరాబాద్లో పార్టీ ప్లీనరీ ఏర్పాటు చేసింది. కేవలం ఆహ్వానం అందిన వారు మాత్రమే హాజరు కావాలని అధిష్ఠానం పేర్కొన్నది. ఇందుకు గానూ నాయకగణం సిద్ధమవుతున్నది. సమావేశానికి మంత్రి హరీశ్రావు నేతృత్వంలో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల పార్టీ అధ్యక్షులు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ సభ్యులతో పాటు మండల, కమిటీల అధ్యక్షులు, అనుబంధ కమిటీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు తరలివెళ్లనున్నారు.
సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వారివారి జిల్లాలో పార్టీ ఆహ్వానితుల జాబితాను పార్టీ ఎమ్మెల్యేలకు అందించారు. అందుకు అనుగుణంగా పార్టీ ప్లీనరీకి తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. కాగా, గ్రామాల్లో పార్టీ అధ్యక్షుడు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్యనాయకులు, వివిధ వర్గాల ప్రజలతో కలిసి గులాబీ జెండాను ఎగురవేస్తారు. ఉదయం 8 గంటలకు అన్ని గ్రామాలు, పట్టణాల్లో జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునివ్వగా, ఈ మేరకు అన్ని చోట్ల ఏర్పాట్లు చేసుకుంటున్నారు.