ఉమ్మడి జిల్లా నెట్వర్క్, డిసెంబర్ 9 ;తమ అభిమాన నాయకుడు, గులాబీ అధినేత కేసీఆర్ కోలుకోవాలని శనివారం ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ నేతలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మసీదుల్లో ముస్లింలు, చర్చీల్లో క్రైస్తవులు ప్రార్థనలు చేశారు.కేసీఆర్కు శస్త్రచికిత్స విజయవంతం కావడంపై గులాబీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్కు ఇష్టదైవమైన నంగునూరు మండలంలోని కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడాలని దేవుడికి మొక్కుకున్నారు.
తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ నిండునూరేండ్లు చల్లగా ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అభిమాన నాయకుడు, గులాబీ దళపతి కేసీఆర్ కోసం శనివారం ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. హైదరాబాద్ యశోద దవాఖానలో శస్త్రచికిత్స విజయవంతం కావడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గులాబీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడాలని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆయుష్మాన్భవ అంటూ దీవిస్తున్నారు.