హుస్నాబాద్ టౌన్, డిసెంబర్ 18 : ఠాణాకు వెళ్లాలంటే భయం. భయాన్ని తొలిగించి న్యాయం అందించే ఠాణాగా మార్చాడు. నక్సలిజానికి జనం జేజేలు పలుకుతూ ఎర్రజెండాలను గుండెలకు హత్తుకున్న పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో పోలీసులు అంటే ప్రజలకు నమ్మకం కలిగించడమే కాకుండా ప్రజల పోలీస్ స్టేషన్గా మార్చాడు. అన్నలకు మద్దుతుగా నిలుస్తున్న పరిస్థితులను పూర్తిగా మార్చివేసి ప్రజాపోలీసుగా ప్రజల మదిలో నిలిచాడు దివంగత ఎస్సై జాన్విల్సన్. ఆనాడు విప్లవోద్యమాలు ఉధృతంగా సాగుతున్న తరుణంలో 31 ఏండ్ల క్రితమే ఫ్రెండ్లీ పోలీసింగ్కు స్వీకారం చుట్టిన వ్యక్తి ఎస్సై జాన్విల్సన్.
రామవరం మందుపాతర ఘటనకు 31ఏండ్లు..
నక్సలైట్లకు పుట్టినిల్లుగా ఉన్న హుస్నాబాద్ ప్రాం తంలో ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న క్రమంలో మం దుపాతర పేల్చిన ఘటన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని నివ్వెర పరిచింది. 1991 డిసెంబర్ 18న నేటి అక్కన్నపేట మండలం రామవరంలో ఆర్టీసీ బస్సును నక్సల్స్ పేల్చారు. డిసెంబర్ 19న కేసు దర్యాప్తు చేసేందుకు మరో ఆర్టీసీ బస్సులో హుస్నాబాద్ ఇన్చార్జి సీఐ యాదగిరి, హుస్నాబాద్ ఎస్సై జాన్ విల్సన్తో పాటు పలువురు సీఆర్పీఎఫ్ పోలీసులు, ఆర్టీసీ డిపో మేనేజర్, కంట్రోలర్, ఇద్దరు కండక్టర్లు, ఒక డ్రైవర్, ఇద్దరు గ్రామ సేవకులు, ఇద్దరు మిలిటెంట్లు రామవరం గ్రామానికి వెళ్లారు. దర్యాప్తు పూర్తిచేసుకుని తిరిగి ఆర్టీసీ బస్సులో వస్తుండగా నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది, గ్రామ సేవకులు, మిలిటెంట్లతోపాటు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పోలీసువర్గాలతో పాటు ఆనాటి ప్రభుత్వాన్ని సైతం కలవరపరిచింది.
హుస్నాబాద్ కంటనీరొలికింది…
ఆర్టీసీ బస్సును మందుపాతర పెట్టి పేల్చివేసిన ఘటనలో హుస్నాబాద్ ఎస్సైగా పనిచేస్తున్న జాన్విల్సన్ మృ తిచెందాడనే వార్తతో జనం కంటనీరు పెట్టారు. ఖాకీలు కర్కశకులు అనే నానుడి ఉన్న ఆనాటి పోలీసు వ్యవస్థలో, ప్రజల పోలీస్స్టేషన్గా తీర్చిదిద్దిన మనిషిగా గుర్తిం పు పొందిన జాన్విల్సన్ ఇక లేరనే వార్త ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. న్యాయాన్ని అందించే పోలీస్స్టేషన్గా మార్చి, ఈ ప్రాంత ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారు జాన్విల్సన్. ఆయన మరణవార్త విని హుస్నాబాద్ ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. మరో వారం రోజుల్లో పెండ్లి కొడుకుగా జాన్విల్సన్ పెండ్లి పీటలపై కూర్చోవాల్సిన స్థితిలో అందరికీ దూరమైపోయాడనే వార్త ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
జన హృదయాల్లో..
కన్నబిడ్డలే తల్లిదండ్రులను కాదంటున్న కొడుకులను మందలించి వారిని బాగుగా చూసుకునే విధంగా మార్చ డం, చదువులకు పేదరికం అడ్డుకాకుండా ఆర్థిక సాయం అందించడం, కోడళ్లపై అత్తామామ, భర్తల వేధింపులను అరికట్టడంతోపాటు లంచమనే పదం పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కకుండా నిక్కచ్చిగా విధులు నిర్వర్తించాడు జాన్విల్సన్. పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కిన వారందరికీ న్యాయం చేసేందుకు కృషిచేసి ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశాడు. జాన్విల్సన్ విగ్రహాన్ని స్థానిక పోలీస్స్టేషన్ ఎదుట ప్రజల సహకారంతో పోలీస్శాఖ ఏర్పా టు చేసింది. మందుపాతర ఘటన జరిగి 31 ఏండ్లు గడిచినప్పటికీ హుస్నాబాద్ ప్రాంత ప్రజల గుండెల్లో ఆయన నేటికీ చిరస్మరణీయుడే.
వర్ధంతి కార్యక్రమాలు…
సీఐ యాదగిరి, ఎస్సై జాన్విల్సన్ వర్ధంతిని ఏటా నిర్వహిస్తున్నారు. నేడు హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జాన్విల్సన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బోయిని ఎల్లయ్య తెలిపారు. వీరి వర్ధంతిని పురస్కరించుకొని వృద్ధులకు పండ్లు, వస్ర్తాలు పంపిణీ చేస్తాయని ఆయన తెలిపారు.