సిద్దిపేట, నవంబర్ 18: పేదింటి ఆడపిల్లల పెండ్లిలకు సాయం చేస్తున్న ఒకే ఒక్క నాయకుడు సీఎం కేసీఆర్, దేశానికే ఆదర్శంగా నిలిచేలా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అందిస్తున్నారని, ఈ పథకాలతో పేదింటి తల్లికి ధైర్యం వచ్చిందని మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సిదిపేట నియోజకవర్గ పరిధిలోని 216మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ఇల్లు కట్టి చూడు, పెండ్లి చేసి చూడు సామెత ఉండేదని, ఈ రెండు చాలా కష్టమని, కానీ ఇవాళ టీఆర్ఎస్ సర్కారుతో పేదింటికి భరోసా వచ్చిందన్నారు. ప్రైవేటుకు దీటుగా సర్కారు దవాఖానల్లో సదుపాయాలు ఉన్నాయని, అన్ని రకాల పరీక్షలు, వైద్యులు ఉన్నారని, పేదల కోసం మెరుగ్గా వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ దవాఖానల్లో అనుభవం ఉన్న వైద్యులు ఎక్కువ ఉన్నారని, వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. నియోజకవర్గ పరిధిలోని 111 కుటుంబాలకు రూ.30 లక్షల 31 వేల సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. పట్టణంలోని 40 మందికి రూ.11 లక్షల 37 వేలు, సిద్దిపేట రూరల్ మండలంలోని 10 మందికి రూ.30 లక్షల 4 వేలు, సిద్దిపేట అర్బన్ మండలంలోని ఏడుగురురికి రూ.18 లక్షల 5550 వేలు, చిన్నకోడూర్ మండలంలోని 26మందికి రూ.65 లక్షల 5 వేల 500, నంగునూరు మండలంలోని 15 మందికి రూ.40 లక్షలు, నారాయణరావుపేట మండలంలోని 13 మందికి రూ.3 లక్షల 49 వేల రూపాయల చొప్పున మొత్తం రూ.30 లక్షల 31 వేల 500లు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.