సిద్దిపేట, సెప్టెంబర్ 16: వైద్యవిద్యపై ఆసక్తిని పెంచడానికి మెడ్ ఎక్స్పో -2022 ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నిర్వహిస్తున్న మెడ్ ఎక్స్పో -2022ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ విమల థామస్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా వైద్య విద్యార్థులు ఏర్పాటు చేసిన 70 స్టాళ్లను మంత్రి పరిశీలించారు.మానవ శరీరంలో జరిగే మార్పులు అవయవాల పనితీరు, వ్యాధులు రావడానికి గల ప్రధాన కారణాలు, వాటిని ఏ విధంగా అధిగమించవచ్చో క్షుణ్ణంగా విద్యార్థులు తమ ప్రదర్శనల ద్వారా తెలియ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. విద్యార్థులు తరగతిగదుల్లో విన్న దానికంటే ప్రాక్టికల్గా చూసినప్పుడే తాము చదువుతున్న విషయం బాగా అ ర్థం అవుతుందన్నా రు.
కరోనా కారణం గా రాష్ట్రంలో గత మూడేండ్లుగా ఇలాంటి కార్యక్రమం ఎక్కడా నిర్వహించలేదన్నారు. సిద్దిపేట మెడికల్ కాలేజీ విద్యర్థులు, అధ్యాపకులు చాలా చక్కగా కార్యక్రమం నిర్వహించారని మంత్రి అభినందించారు. రెండు రోజుల పాటు జరిగే మెడ్ ఎక్స్పోను జిల్లాలోని ఆయా పాఠశాలల విద్యార్థులు, ప్రజాప్రతినిధులు వచ్చి చూసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు మంత్రి ఆదేశించారు. రెండు రోజుల్లో 6వేల మంది తిలకించేలా ఏర్పా ట్లు చేశామన్నారు. సీఎం కేసీఆర్ కృషితోనే సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పడిందన్నారు. తక్కువ కాలంలో సిద్దిపేట కాలేజీ గొప్పగా అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రంలో వైద్యవిద్యను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీలను ఏర్పా టు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం అధునాతన వైద్యం అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల పెంపునకు కృషిచేసిందన్నారు. సిద్దిపేట మెడికల్ కాలేజీలో సైతం 48పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు.
దీంతో ఇక్కడి విద్యార్థులకు ఇక్కడే పీజీ చేసే అవకాశం ఉందన్నారు. సిద్దిపేట మెడికల్ కళాశాల ఆవరణలో 900 పడకల దవాఖాన ఏర్పాటు పనులు జరుగుతున్నాయని, మరో 7,8 నెలల్లో దవాఖాన పనులు పూర్తి చేసి బోధన దవాఖాన అందుబాటులోకి తీసుకు వస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. రూ.15కోట్లతో సిద్దిపేట దవాఖానలో గుండె ఆపరేషన్లు, వైద్యం కోసం క్యాత్ల్యాబ్ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. సిద్దిపేట వైద్య కళాశాలలో ల్యాబరేటరీ, లైబ్రరీ, డెడ్బాడీస్, పుస్తకాలు,ఫ్రీ వైపై, టీచింగ్ స్కిల్ మెరుగుపరిచేందుకు నిధులు మంజారు చేశామని మంత్రి తెలిపారు. అధ్యాపకులు ఉత్తమ వైద్య విద్యార్థులను తయారు చేసేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కాశీనాథ్, నర్సింగ్ కౌన్సిల్ మెంబర్ పాల సాయిరాం, నాయకులు మచ్చ వేణుగోపాల్రెడ్డి, వైద్యారోగ్యశాఖ అధికారులు, మెడికల్ కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.