సిద్దిపేట, సెప్టెంబర్ 3: ‘స్వచ్ఛబడి చాలా బాగుంది.. స్వచ్ఛబడిలో కంపోస్టు ఎరువు త యారీ.. ఇక్కడ వివిధ రకాల చెట్లు, పరిసరాలకు ఆకర్షితులయ్యాం.. సిద్దిపేట స్వచ్ఛబడి గురించి పేపర్లో చదివి తప్పకుండా సందర్శించాలని నిర్ణయించుకున్నాం. ప్రత్యక్షంగా స్వచ్ఛబడి చూడడం ఆనందంగా ఉందని” హైదరాబాద్లోని బేగంపేట. సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల సిబ్బంది పేర్కొన్నారు.ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకురాలు ధనలక్ష్మి మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన విద్యార్థులంతా హైదరాబాద్ ప్రకృతి క్లబ్లో సభ్యులన్నారు. ప్రతి శనివారం హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లోని అపార్టుమెంట్లలోని ప్రజలు, పాఠశాలలకు వెళ్లి తడి, పొడి, హానికర చెత్త వేరుచేసే విధానం, కంపోస్టు ఎరువు తయారీ చేసే వి ధానాన్ని తెలియజేస్తారన్నారు. అందులో భా గంగా సిద్దిపేట స్వచ్ఛబడిని సందర్శించినట్లు తెలిపారు. సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రాజనర్సు మాట్లాడుతూ పేపర్లో స్వచ్ఛబడి గురించి చదివి విద్యార్థులు సిద్దిపేట పట్టణానికి రావడం సంతోషంగా ఉన్నదన్నారు.
అధ్యాపకులు, విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఎంతో మంది స్వచ్ఛబడికి వచ్చి సందర్శించడంలో మంత్రి హరీశ్రావు కృషి చాలా ఉందన్నారు. పట్టణ ప్రజలు తడి, పొడి, హానికర చెత్త వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందిస్తున్నారన్నారు. ప్రజలు, మున్సిపల్ అధికారులు, సిబ్బం ది సహకారంతో సిద్దిపేట పట్టణం రాష్ట్రంలో ముందు వరుసలో ఉన్నదన్నారు. స్వచ్ఛబడిలో డిజిటల్ క్లాస్ల ద్వారా కౌన్సిలర్ దీప్తీనాగరాజు విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులు బుస్సాపూర్ కంపోస్టు యార్డు, బయో గ్యాస్ తయారీ విధానం, సిద్దిపేట కోమటి చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్కు కళాశాల అధ్యాపకులు ధనలక్ష్మి, అనిల్ ఎకో ఫ్రెండ్లీ ఫైల్స్, బ్యాగ్స్ అందజేశారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గోపయ్య, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.